Morne Morkel: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం కావడంపై వస్తున్న విమర్శలను భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తిప్పికొట్టారు. జట్టులో ఒక యువ ఆటగాడిపై విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ఇప్పటికే జట్టు కోసం నిలకడగా రాణిస్తున్న అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ వంటి ఆటగాళ్లను పక్కనబెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్కు ముందు మోర్కెల్ విలేకరులతో మాట్లాడారు. కేవలం సోషల్ మీడియా ప్రచారాలు, ప్రజల డిమాండ్లను బట్టి నిర్ణయాలు తీసుకోలేమని, అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లకు తగిన గౌరవం, అవకాశాలు ఇవ్వడమే తమ ప్రాధాన్యత అని చెప్పారు. ప్రస్తుత ఓపెనింగ్ జోడీ తమ అద్భుతమైన ప్రదర్శనల ద్వారానే మేనేజ్మెంట్ నమ్మకాన్ని గెలుచుకుందని గుర్తుచేశారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకున్న మాట నిజమే అయినప్పటికీ, అతనికి ఇంకా క్యాప్ దక్కకపోవడం వెనుక ఉన్న వ్యూహాన్ని మోర్కెల్ వివరించారు.
గడిచిన రెండేళ్లలో అభిషేక్ శర్మ టీ20 ఫార్మాట్లో అత్యంత విధ్వంసకర బ్యాటర్గా ఎదిగాడు. 2024లో జింబాబ్వేపై మెరుపు సెంచరీతో పాటు, 2025లో ఇంగ్లాండ్పై కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు, అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరోవైపు, సంజూ శామ్సన్ ఇటీవలి కాలంలో కొన్ని మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ, ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ (Player of the Tournament) అవార్డును అందుకున్నాడు. పెద్ద మ్యాచ్లలో రాణించగల ఆటగాడిగా అతనికి ఉన్న గుర్తింపు అలాగే ఉంది.
శామ్సన్ ఐపీఎల్లో కూడా అద్భుతంగా రాణించాడని, అందువల్ల ఒక కోచింగ్ స్టాఫ్గా ఫామ్లో ఉన్న ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం తమ బాధ్యత అని మోర్కెల్ అన్నారు. ఒక యువ ఆటగాడు జట్టులోకి రావడం ఎంతో ఉత్సాహాన్నిచ్చే విషయమే అయినప్పటికీ.. కేవలం ఒకరి కోసం స్థిరపడిన కాంబినేషన్ను మార్చలేమని చెప్పారు. ఇలా సీనియర్ ఆటగాళ్లకు అండగా నిలవడం వల్ల డ్రెస్సింగ్ రూమ్లో నమ్మకం పెరుగుతుందని, కేవలం ఓపెనర్లకే కాకుండా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు కూడా తాము అండగా ఉంటామనే స్పష్టమైన సంకేతం వెళ్తుందని మోర్కెల్ అభిప్రాయపడ్డారు. భారత జట్టు మేనేజ్మెంట్ ఓపెనింగ్ స్థానాల్లో స్థిరత్వానికి, సీనియర్ల నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో.. దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

