NTV Telugu Site icon

PM Modi: ఇటలీలో మోడీ బిజిబిజీ.. అగ్ర నేతలతో సమావేశం

Modi 2

Modi 2

జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని మోడీ.. శుక్రవారం బిజిబిజీగా గడిపారు. పలు దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటలీ వేదికగా జరుగుతోన్న జీ7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. ఈ సందర్భంగా జీ7 దేశాల అధినేతలతో మోడీ వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో కూడా సంభాషించారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం విషయంలో భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తూనే.. రష్యా వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌కు పలుమార్లు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుత సమావేశంలో పుతిన్‌ సేనలతో జరుగుతోన్న ఘర్షణకు సంబంధించి పలు అంశాలను మోడీకి జెలెన్ స్కీ వివరించినట్లు సమాచారం. ఇక ఈ జీ7 సదస్సులో ఈ యుద్ధం గురించే చర్చ జరిగింది. ఫ్రీజ్‌ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపాయి. రక్షణ, అంతరిక్ష, విద్య, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోడీ, మేక్రాన్ చర్చలు జరిపారు. దాంతోపాటు పలు కీలక విషయాలపై తమ మధ్య చర్చ జరిగినట్లు మోడీ వెల్లడించారు.

 

ఇదిలా ఉంటే G7 సమ్మిట్‌లో భాగంగా అవుట్‌రీచ్ సెషన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోస్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంతేకాకుండా కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.