MMTS Train Case : ఎంఎంటీఎస్ ట్రైన్లో జరిగిన అత్యాచారయత్న ఘటనలో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు అందించిన వాదనలను బాధిత యువతి ఖండించింది. తాను పోలీసులను ఎటువంటి తప్పుదారి పట్టించలేదని స్పష్టం చేస్తూ, కేసును పునఃసమీక్షించాలని ఆమె కోరింది.
సికింద్రాబాద్ నుండి మేడ్చల్కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు తెలిపింది. ట్రైన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, ఆ దుండగుడి నుండి తప్పించుకోవడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాల్సి వచ్చిందని మరోసారి ఆమె వివరించింది.
పోలీసులు తనకు నిందితుడిని చూపించగా… తాను అతన్ని స్పష్టంగా గుర్తుపట్టినట్లు బాధితురాలు వెల్లడించారు. కాగా, తాను పోలీసులకు ఏ విషయమైను తప్పుగా తెలియజేయలేదని, పూర్తి నిజాయితీగా సహకరిస్తున్నానని ఆమె తెలిపింది.
“నాకు జరిగిన ఈ దారుణమైన సంఘటన మరెవ్వరికీ జరగకూడదు” అంటూ బాధితురాలు తన బాధను వ్యక్తం చేశారు. మార్చి 22వ తేదీన జరిగిన ఈ ఘటనపై మళ్లీ సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను ఆమె కోరుతున్నారు.