ఇటీవల తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫిట్మెంట్పై పక్క రాష్ట్రమైన ఏపీతో పోల్చుతు చేసిన వ్యా్ఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. హరీష్ రావు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికి నిజం. అందులో ఎలాంటి అవాస్తవాలు లేవన్నారు. ఆయన మాట్లాడిన సందర్బం వేరని, తెలంగాణ ప్రభుత్వం 73శాతం ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66 శాతం మించి ఇవ్వలేదన్నారు. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు అని మంత్రి చెప్పారని ఇది వాస్తవమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పథకాల పైన ప్రాజెక్టుల పైన అనేకసార్లు కంప్లైంట్ చేసింది.
విడిపోయి సీఎం కేసీఆర్ నాయకత్వంలో మేము బాగా అభివృద్ధి చెందుతున్నామని, మాపైన ఈర్ష్య ఉండవచ్చని మేం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల అనడం సరికాదని, ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్న వారిని, విషం కక్కిన వారినీ మాత్రమే వ్యతిరేకించామన్నారు. ఆ తర్వాత అందరం కలిసి పనిచేసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నామని, మంత్రి హరీష్ రావు ఇతర రాష్ట్రాల వారిపై గాని, ప్రభుత్వ ఉద్యోగులపై గాని ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ఉచిత కరెంటు అంటూ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి నేడు వైయస్ ఆశయాలను తుంగలో తొక్కే నిర్ణయాలను వైయస్ఆర్ పార్టీ తీసుకున్నదని, నాణ్యమైన కరెంటు ఇస్తామంటూ, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని, ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణపై గాని, టీఆర్ఎస్ నాయకులపై గానీ, మంత్రి హరీష్ రావుపై గానీ అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నానని ఆయన వెల్లడించారు.