గత ఐదేళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలని.. సంక్షేమ ప్రభుత్వ విజయానికి సారథులుగా ఉండాలని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. పెదకూరపాడు మండలం లగడపాడు, కన్నెగండ్ల గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నంబూరు శంకరరావుకి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. లగడపాడు సచివాలయ పరిధిలో గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. పౌర సేవల కోసం గ్రామ సచివాలయాలు, వైద్య సేవల కోసం హెల్త్ సెంటర్లు నిర్మించామన్నారు.
Read Also: Reserve Bank of India: లోక్సభ ఎన్నికలకు ముందు ఆర్బీఐ కీలక ఆదేశాలు..
ఇక, అన్న దాతల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి.. వారి కష్టాల్లో సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే శంకరరావు అన్నారు. నాణ్యమైన విద్య కోసం నాడు- నేడు ద్వారా పాఠశాలలు బాగు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే దత్తత తీసుకొని మర్చిపోయిన కన్నెగండ్లకు తాము రోడ్డు వేశాం.. నియోజకవర్గం గురించి తెలియని వారు ఇచ్చిన స్క్రిప్టు చదివి తనపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు కళ్లకు ఇక్కడ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడకు వెళ్లిన బూటకపు హామీలతో చంద్రబాబు, ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
Read Also: Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్లో పేలుడు.. పాకిస్థాన్తో సంబంధాలపై ఆరా..
కాగా, గత ఎన్నికల్లో రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ప్రశ్నించారు. నిన్నటి వరకు జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే హామీలను ఎన్నికల తాయిలాలుగా ప్రకటిస్తున్నారన్నారు. మరి ఆ హామీలను చంద్రబాబు అమలు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అన్నారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడా చూసి ప్రజలు వివేకంతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తమ పాలనలో మంచి జరిగిందని భావిస్తే తమకు మద్దతు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీ అభ్యర్ధిగా అనిల్ కుమార్ యాదవ్ లకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నంబూరు శంకరరావు కోరారు.