NTV Telugu Site icon

Seediri Appalaraju: వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పని చేయడం నేరమా..?

Seediri Appalaraju

Seediri Appalaraju

Seediri Appalaraju: వాలంటీర్ల సేవల గురించి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ రమేష్, పవన్, చంద్రబాబులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ వాలంటీర్లు చేస్తున్నారని మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మ గడ్డ రమేష్ చౌదరి కొవిడ్ టైంలో ఎన్నికలు ఆపి ఇంట్లో ఉంటే వాలంటీర్లే ప్రజలందరికీ సపర్యలు చేశారని గుర్తు చేశారు. కొవిడ్ సమయంలో చంద్రబాబు భార్యా బిడ్డలతో తెలంగాణలో తలదాసుకుంటే మేమంతా కొవిడ్‌తో యుద్ధం చేశామన్నారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబుకు కక్ష.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

కొవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మరిచి పోగలమా అంటూ మంత్రి ప్రశ్నించారు. వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పని చేయడం నేరమా అంటూ ఆయన వాపోయారు. వాలంటీర్లను టెర్రరిస్టులని అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అయితే వాలంటీర్లపై మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారన్నారు. వాలంటీర్లది మూటలు మోసే ఉద్యోగం, ఇంట్లో లేడీస్ ఉంటే ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు అంటున్నారని ఆయన ఆగ్రహించారు. ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ఎప్పటికి ఈ దౌర్భాగ్యం వదిలిపోతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కొవిడ్ సమయంలో రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల జనాభా కు సేవలు అందించిన ఘనత వాలంటీర్లదేనని.. చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దరిద్రపు పాలనలో అవ్వా తాతలను జన్మభూమి కమిటీ సభ్యులు అవమానించారని ఆరోపించారు.