బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు. తాజాగా మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు దిగజారుడు, దివాలకోరు మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తెలంగాణ వ్యాప్తంగా 3 వేల పెన్షన్ ఇస్తామని దమ్ముంటే మోడీ, అమిత్ షా తో చెప్పించండని, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి ఆ బ్రదర్స్ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయిన మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని, ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్లోరైడ్ ఉంటే నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్ గా మరబోతుందని డబ్ల్యూహెచ్వో చెప్పిందని, కేసీఆర్ కు మునుగోడుపై ప్రేమ ఉంటుందా? మోడీకి ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను బీజేపీ అవమానపర్చిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చి ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని, కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చాలని కోరితే ఇప్పటి వరకు కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
వాటా తేల్చకుండా నల్గొండకు తీరని అన్యాయం చేసింది కేంద్రమని, కృష్ణా జలాల్లో వాటా తేల్చని బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు ఎక్కడిదని, కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. కాళేశ్వరం తొలి ఫలితాలు నల్గొండ జిల్లాకే అందిందని, నల్గొండ జిల్లాలో 5 లక్షల కరెంటు మోటార్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువ లాభపడింది కూడా నల్గొండనేనని మంత్రి హరీష్ రావు అన్నారు. పేదరికం పెరిగింది, ఆకలి పెరిగిందని ప్రపంచ దేశాల ముందు భారతదేశం పరువు పోయింది. పాకిస్థాన్ కంటే భారత్ లో ఆకలి ఎక్కువ అని జాతీయ సంస్థలు తేల్చి చెప్పాయి. ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలన ఒక్క మాటలో… సఫలం, సంక్షేమం, సామరస్యం. ఎనిమిదేళ్ల బీజేపీ పాలన ఒక్క మాటలో చెప్పాలంటే విఫలం, విషం, విద్వేషం. మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలవాలా? రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలా? రాజగోపాల్ రెడ్డి గెలిచినా మునుగోడులో చేసేదేమీ లేదు. కేసీఆర్ ను, టిఆర్ఎస్ ప్రభుత్వం ను దూషించడంమే ఆయన పని. బీజేపీ అభ్యర్థిది ఆత్మ గౌరవ పోరాటం కాదు… ఆస్తులు పెంచుకునే ఆరాటమని ఆయన ఆరోపించారు.