MI Captain Change: మరో 5 రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కానుంది. అయితే ఇంతలో ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్య తన నాయకత్వ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించాలంటూ ఆయన సూచించారు. ముంబై ఇండియన్స్ (MI) చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2020లో టైటిల్ గెలిచింది. అంటే ముంబై ట్రోఫి గెలిచి ఐదేళ్లు అవుతుంది.
2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ ద్వారా హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆ సీజన్ లో జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానలలో నిలవడం పలు విమర్శలకు దారితీసింది. ఇక ఐపీఎల్ 2025 సీజ న్లో ప్లే ఆఫ్స్ కు చేరినా, ట్రోఫీ దక్కకపోవడంతో కెప్టెన్సీపై మళ్లీ రచ్చ మొదలైంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి వరల్డ్కప్ విజేత కెప్టెన్లు జట్టులో ఉండగా హార్దిక్ పాండ్య నాయకత్వంపై ఇప్పుడు అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం, జట్టు మేనేజ్మెంట్, అలాగే హార్దిక్, రోహిత్, సూర్యకుమార్ కలిసి భవిష్యత్పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ లో సూచించారు. ఈ పరిస్థితిని “వింత పరిస్థితి”గా ఆయన పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టీమ్ ఇండియాకు విజయం అందించిన ‘సూర్యకుమార్ యాదవ్’ కెప్టెన్సీకి సరైన ఎంపిక అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు హార్దిక్ పాండ్యానే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని, సూర్యకుమార్ కు బాధ్యతలు అప్పగిస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని శ్రీకాంత్ సూచించడం కొసమెరుపు. “సూర్యకుమార్ లీడ్ చేయాలి, నేను సపోర్ట్ చేస్తాను” అని హార్దిక్ చెబితే జట్టులో ఉన్న అంతర్గత సమస్యలు పూర్తిగా సర్దుకుంటాయని ఆయన అన్నారు.