ఉద్యోగం చూసుకోమని మందలించడంతో కోపం కట్టలు తెంచుకున్న ఓ అల్లుడు యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసి… మామ హత్యకు స్కెచ్ వేశాడు. పెళ్లై రెండు నెలలే అయినా.. కుటుంబంలో కలహాల కారణంతో చివరకు నరరూప రాక్షసుడిగా మారిపోయాడు. మార్కాపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన వెనుక అసలు స్టోరీ ఏంటి. అల్లుడే మామపై దాడి ఎందుకు చేశాడు.. ?
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట గాంధీ బజార్ ప్రాంతం.. మధ్యాహ్నం సమయం.. ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దూదేకుల ఖాజావలి అనే వ్యక్తి తనకు వరుసకు అల్లుడు అయ్యే పీరావలి అనే వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అదే సమయంలో పిల్లనిచ్చిన మామ దూదేకుల రాజా హుస్సేన్పై కూడా పీరావలి తీవ్ర దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో హుస్సేన్ రాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. హత్య జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య వెనుక కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
Also Read:Rangareddy: చనిపోయిన తల్లిపై పడి ఏడ్చి.. నిస్సహాయంగా కుప్పకూలిన చిన్నారి..
బేస్తవారిపేటకు చెందిన హుస్సేన్ రాజా తన కుమార్తె కరిష్మాను గిద్దలూరు మండలం పొదలకుంటపల్లికి చెందిన పీరావలితో వివాహం జరిపించాడు. మొదట్లో బాగానే సాగిన వారి దాంపత్య జీవితం… కొద్ది రోజులకే విభేదాలు నెలకొన్నాయి. ఉద్యోగం కోల్పోయిన పీరావలి ఇంట్లో ఖాళీగా ఉండటం… భార్య కరిష్మా పని చూసుకోమని ఒత్తిడి చేయడం… ఈ కారణాలతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. చివరకు భర్త హింసను తట్టుకోలేక కరిష్మా తన తండ్రి ఇంటికి చేరుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా మామ ఇంటికి వచ్చిన పీరావలికి… మామ, చిన్న మామలు మంచి మాటలు చెప్పి… ఉద్యోగం చూసుకోమని, కూతురితో సర్దుకుపోవాలని మందలించడం అతనికి కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే… హత్యకు ముందు పీరావలి తన స్మార్ట్ఫోన్లో యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసినట్లు సమాచారం. తన భర్త హత్య ఎలా చేయాలో అనే వీడియోలు చూస్తున్నాడని కరిష్మా అప్పటికే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను హెచ్చరించింది. వారు కరిష్మా మాటలను లైట్ తీసుకున్నారు.
కానీ పీరావలి మాత్రం అదే పని మీద ఉన్నాడు. పాల ప్యాకెట్ కోసం బజారుకు వెళ్లిన అతను ఓ చిన్నపాటి కత్తి కూడా కొనుగోలు చేశాడు. ఇంటికి చేరుకొని ఇంట్లో నిద్రిస్తున్న చిన్న మామ ఖాజావలిపై కత్తితో దాడి చేసి గొంతును కోశాడు. అంతటితో ఆగకుండా రోకలి బండతో తలపై దాడి చేసి హతమార్చాడు. కట్టలు తెంచుకునే కోపంతో నరరూప రాక్షసుడిగా పీరావలి మారిపోయాడు. తర్వాత అదే వీధిలో వేరే ఇంట్లో నిద్రిస్తున్న మామ హుస్సేన్ రాజాను హత్య చేయాలని ఇంటిలోకి ప్రవేశించాడు. చేతికి దొరికిన ఫోర్క్ స్పూన్తో మెడ పై దాడి చేయబోయాడు. తప్పించుకునే ప్రయత్నంలో చెవి, తల భాగంలో హుస్సేన్ రాజాకు తీవ్ర గాయాలయ్యాయి. హుస్సేన్ రాజ పెద్ద పెద్దగా కేకలు వేయడంతో పీరావలి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ రాజను కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు పీరావలి కోసం పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతో సౌమ్యంగా మంచి వాడిగా కనిపించే పీరావలి ఇంత క్రూరంగా హత్య చేయడం భార్యతోపాటు మామ తరుపు బంధువులు కూడా నమ్మలేకపోతున్నారు. పెళ్లయిన 2 నెలలకే పీరావలి ఇంత క్రూరంగా మారిపోయి ఎందుకు హత్య చేశాడు? పీరావలికి మామని చంపే అంత కోపం ఎందుకు వచ్చింది? అస్సలు చిన్న మామ ఖాజావలి, మామ హుస్సేన్ రాజా పీరావలికి ఏమి చెప్పారు? గ్రామంలో మంచివాడిగా పేరు తెచ్చుకున్న పీరావలి ఇంత నరరూప రాక్షసుడిగా ఎందుకు మారిపోయాడు ? ఈ విషయాలన్నీ పోలీసులు విచారణలో గుర్తించవలసి ఉంది.