మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న ఏపీ పోలీసుల ఎదుట ఈరోజు లొంగిపోయారు. నారాయణతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ, డివిజినల్, ఏరియా కమిటీలకు చెందిన మరో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు నారాయణ మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని చెప్పారు. దేశంలో మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. సాయుధ పోరాటాన్ని వదిలి.. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని తాను లొంగిపోయినట్లు నారాయణ చెప్పుకొచ్చారు.
‘1990లో ఉద్దానంలో ప్రజా ఉద్యమానికి ఆకర్షితులు అయ్యాను. అప్పుడే మావోయిస్టు పార్టీలో చేరాను. పార్టీ తీర్మానాలకు అనుకూలంగా పనిచేశాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పనిచేశాను. నేను మావోయిస్టు ఉద్యమాల్లో చేరినపుడు పరిస్థితులు, ఇప్పుడు చాలా మారాయి. మేం పనిచేసిన ఆదివాసీ అటవీ ప్రాంతంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పార్టీ అప్డేట్ అవకపోవటమే ఈ వైఫల్యానికి కారణం. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవటంతో ఈ పరిస్థితి వచ్చింది. మావోయిస్టు పార్టీ పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవలేదు, అందుకే ఏవోబీ సహా దేశ వ్యాప్తంగా పార్టీ కనుమరుగు అయింది’ అని నారాయణ వివరించారు.
‘సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు మారలేదు. అందువల్లే పార్టీ ఇలా అయింది. పార్టీ హత్య చేసిన ఘటనల్లో నేను కూడా భాగస్వామి అయ్యాను. అయితే పార్టీ నిర్ణయాల్లో భాగంగా మాత్రమే అవి జరిగాయి. నాకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు, శత్రువుత్వం లేదు. జరిగిన ఘటనకు నేను పశ్చాత్తాపపడుతున్నా’ అని మావోయిస్టు నారాయణ చెప్పారు. నారాయణరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం. ఆయన దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1990లో పీపుల్స్ వార్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మిలిటరీ ఆపరేషన్స్లో దిట్ట అనే పేరు నారాయణకు ఉంది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తూ.. పార్టీ ఎదుగుదలకు కృషి చేశారు. ఏపీ, ఒడిశాల్లో అనేక కేసులు ఆయనపై ఉన్నాయి.