NTV Telugu Site icon

Lockdown Love Story: విషాదాంతంగా ముగిసిన లాక్‌డౌన్ లవ్‌స్టోరీ.. ముగ్గురు బలి

Lockdown

Lockdown

Lockdown Love Story: అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో కొవిడ్ లాక్‌డౌన్ ప్రేమకథ మూడు భయంకర హత్యలతో విషాదాంతంగా ముగిసింది. 25 ఏళ్ల నజీబుర్‌ రెహ్మాన్‌, 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్‌ల మధ్య లాక్‌డౌన్ సమయంలో మొదలైన ప్రేమ.. ఆమె, ఆమె తల్లిదండ్రుల హత్యకు కారణమైంది. నిందితుడు తొమ్మిది నెలల శిశువుతో పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెకానికల్ ఇంజినీర్ అయిన నజీబుర్ రెహ్మాన్‌ బోరా, సంఘమిత్ర జూన్ 2020లో లాక్‌డౌన్ సమయంలో ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు. నెలరోజుల్లోనే స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో ఇద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆమె అప్పటికే కోల్‌కతా కోర్టులో నజీబుర్‌ను వివాహం చేసుకుంది.

Also Read: Gyanvapi Survey: మసీదు కమిటీ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టులో విచారణ ప్రారంభం

మరుసటి సంవత్సరం, సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ కుమార్తె పైనే దొంగతనం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘమిత్రను అరెస్టు చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ పొందిన తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. జనవరి 2022లో సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ పారిపోయారు, ఈసారి వారు ఐదు నెలలపాటు చెన్నైలో నివాసం ఉన్నారు. ఆ దంపతులు ఆగస్టులో గోలాఘాట్‌కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతి. వారు నజీబుర్ ఇంటిలో నివసించడం ప్రారంభించారు. గత నవంబర్‌లో వారికి ఒక కుమారుడు జన్మించాడని పోలీసులు తెలిపారు. అయితే, నాలుగు నెలల తర్వాత ఈ ఏడాది మార్చిలో సంఘమిత్ర తన చిన్నారి కొడుకుతో కలిసి నజీబుర్ ఇంటిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. నజీబుర్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కేసు నమోదు చేసి నజీబుర్‌ను అరెస్టు చేశారు. 28 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

Also Read: Gold Fraud: ఘరానా మోసం.. తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి టోకరా

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత, నజీబుర్ తన బిడ్డను కలవాలనుకున్నాడు, కాని సంఘమిత్ర కుటుంబం అతన్ని అనుమతించలేదు. వాస్తవానికి, ఏప్రిల్ 29న సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్‌పై దాడి చేశారని నజీబుర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను కొడవలితో నరికి హత్య చేశాడు. ఆ తర్వాత తన తొమ్మిది నెలల పాపతో పారిపోయాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రుల మృతదేహాలు కొడవలి గాయాలతో రక్తపు మడుగులలో పడి ఉన్నాయి.

నిందితులపై హత్య, ఇంటిపై దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు. ఈ దారుణ హత్యపై రాష్ట్ర సీఐడీ బృందం విచారణ చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.