Mali Bamako JNIM: అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని పోతుందని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలి. ఈ దేశ రాజధాని బమాకోను అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్ (JNIM) పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు దగ్గరగా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచంలోనే ఒక ఉగ్రవాద సంస్థ నియంత్రణలో ఉన్న మొట్టమొదటి దేశంగా మాలి అవతరించవచ్చని పాశ్చాత్య, ఆఫ్రికన్ అధికారులు ఆందోళన చెందుతున్నారని పలు నివేదికలు వెలువడుతున్నాయి.
READ ALSO: Srisailam Gates Lifted: మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు.. ఈ ఏడాది ఏడోసారి నీటి విడుదల..
2017 లో ఏర్పడిన JNIM
అల్-ఖైదాతో అనుబంధం ఉన్న అనేక గ్రూపుల విలీనం ద్వారా JNIM 2017లో ఏర్పడింది. ఈ ఉగ్రవాద సంస్థ దాని ప్రారంభం నుంచి కూడా అల్-ఖైదాకు విధేయతను ప్రతిజ్ఞ చేసింది. పలు నివేదికల ప్రకారం.. ఈ ఉగ్ర సంస్థ యోధులు ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లలో బాంబు తయారీ శిక్షణ పొందారు. JNIM వారాల తరబడి రాజధాని బమాకోను ముట్టడిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ కారణంగా నగరానికి సరఫరా మార్గాలు అన్ని కూడా దాదాపుగా దెబ్బతిన్నాయి. ఆహారం, ఇంధనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. నగరంలో పరిస్థితి దారుణంగా మారడంతో చాలా సైనిక స్థావరాలలో ఇంధనం, మందుగుండు సామగ్రి అయిపోతున్నాయని సమాచారం. యూరోపియన్ అధికారుల నివేదికల ప్రకారం.. ఉగ్రవాద సంస్థ ప్రత్యక్ష దాడి కంటే క్రమంగా గొంతు కోసి చంపే వ్యూహాన్ని అమలు చేస్తోందని వెల్లడించాయి. దీంతో రాజధాని కూలిపోతుందని, రోజులు గడిచే కొద్దీ బమాకోను పూర్తి విధ్వంసానికి దగ్గరగా తీసుకువస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివాదానికి కేంద్రంగా ఇంధనం..
మాలిలో ఇంధనం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఇటీవల ఉగ్రవాదులు అనేక ఇంధన కాన్వాయ్లపై దాడి చేసి డజన్ల కొద్దీ ట్రక్కులను తగలబెట్టారు. బమాకోలో పెట్రోల్ ధర 2,000 CFA ఫ్రాంక్లకు (లీటరుకు దాదాపు $3.50) చేరుకుంది. ఇది మునుపటి కంటే మూడు రెట్లు ఎక్కువ. ప్రస్తుతం దేశంలోని ఏ పెట్రోల్ బంకులోనూ ఇంధనం లేదు. ప్రజలు రోజుల తరబడి పనికి వెళ్లలేకపోతున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కొన్ని విద్యుత్ ప్లాంట్లను రెండు వారాల పాటు మూసివేసింది. దీనంతటికి కారణం దేశ ప్రధాన మంత్రి అబ్దులే మైగా ప్రభుత్వ నిస్సహాయత అని నిపుణులు చెబుతున్నారు.
ఆఫ్రికాలో పెరుగుతున్న అల్-ఖైదా పట్టు..
పశ్చిమ ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో ముఖ్యంగా నైజర్, బుర్కినా ఫాసో, మాలిలలో అల్-ఖైదా తన మూలాలను వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వీళ్లు ఇప్పుడు బెనిన్, ఘనా, టోగో, ఐవరీ కోస్ట్ వంటి సాపేక్షంగా స్థిరమైన దేశాలకు కూడా చేరుకుంటున్నారని చెబుతున్నారు. జూలైలో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. JNIM నాయకులు తాలిబాన్ కాబూల్ వ్యూహం నుంచి ప్రేరణ పొందుతున్నారని వెల్లడించింది. అలాగే ఆ నమూనాను అనుసరించడం ద్వారా మాలిలో పూర్తి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
READ ALSO: Hafiz Saeed: భారత్కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ ?