Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. మూడు నెలల్లోనే మిగిలిన 40 లక్షల లీటర్ల పెట్రోల్..

Work From Home

Work From Home

మలేషియా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ప్రారంభమైన ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లోనే పెట్రోల్ రాయితీ ఖర్చుల్లో ప్రభుత్వానికి 7,309,084 రింగిట్లు (సుమారు రూ. 14 కోట్లకు పైగా) ఆదా అయ్యాయని మలేషియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘తన్ శ్రీ షంషుల్ అజ్రీ అబు బకర్’ వెల్లడించారు. ఈ మూడు నెలల కాలంలో ఏకంగా 40,46,448 లీటర్ల ఇంధన వినియోగం తగ్గడం విశేషం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 6.59 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందారు.

‘హైబ్రిడ్ వర్కింగ్ డే’ విధానం..
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, ప్రభుత్వం ఆగస్టు 1 నుండి సరికొత్త ‘హైబ్రిడ్ వర్కింగ్ డే’ (HWD) విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇంధన రాయితీ ఖర్చులను అదుపులో ఉంచుతూనే, పని ఉత్పాదకతను నిలబెట్టుకోవడం. దీని ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 3 రోజులు కార్యాలయం (ఆఫీస్) నుండి పని చేయాలి. మిగిలిన 2 రోజులు ఇంటి నుండి (WFH) లేదా ప్రత్యామ్నాయ ప్రాంతాల నుండి విధులు నిర్వర్తించవచ్చు.

పొడిగించిన సెలవులకు చెక్..
ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను పెట్టింది. వారాంతపు సెలవులు (Saturdays అండ్ Sundays) లేదా పండుగ సెలవులకు ముందురోజు, ఆ తర్వాత రోజుల్లో హైబ్రిడ్ వర్కింగ్ ఆప్షన్ ఎంచుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి శని, ఆదివారాలు సెలవు ఉంటే.. వారు సోమవారం లేదా శుక్రవారం రోజుల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయడానికి అనుమతి ఉండదు. దీనివల్ల ఉద్యోగులు వరుసగా లాంగ్ వీకెండ్స్ (సుదీర్ఘ సెలవులు) ప్లాన్ చేసుకోకుండా అడ్డుకోవచ్చు. ప్రభుత్వ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా, వ్యయ నియంత్రణతో పాటు సులభతర పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా మలేషియా ఈ నిర్ణయం తీసుకుంది.