కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల, నెమకల్ గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండగా.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
సంగాల గ్రామంలో వైసీపీ నేత గిరి, ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములుపై టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. వైసీపీలో చురుకుగా పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నాయి. అలాగే గిరికి ఫోన్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించారని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు నెమకల్ గ్రామంలో టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన సోదరుడు శ్రీరాములు దాడి చేసి దళిత మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ వర్గీయులు ఆరోపించారు. ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి పరామర్శించారు.
ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. చిప్పగిరి మండలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రించారు. పరస్పర దాడులు, వాహన ధ్వంసం ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు పోలీసుల అదుపులో ఉండగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు.. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు కొనసాగిస్తున్నారు.

