KTR: ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మెందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమే అని ఆయన విమర్శించారు. “బీజేపీ అంటే నమ్మకం కాదు… అమ్మకం” అంటూ పేర్కొన్నారు.
సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్థనాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలతో సకల వనరులు కలిగిన ఈ సంస్థను అంగడి సరుకుగా మార్చిన పాపం మోడీ ప్రభుత్వానిదని ఆయన మండిపడ్డారు. సిసిఐ కి చెందిన ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్క కట్టి ఆన్లైన్లో అమ్మడానికి టెండర్లు పిలవడం బీజీపీ ప్రభుత్వ దగుల్భాజీ తనానికి నిదర్శనమని మంది పడ్డారు. నిర్మాణ రంగంలో సిమెంట్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సీసీఐని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని పదుల సార్లు కేంద్ర మంత్రులను తమ ప్రభుత్వం కోరినా, కనీసం వారు కనికరించకపోవడం ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అన్నారు.
Read Also: IND vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందన్నారు కేటీఆర్. సిసిఐ ను తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్లోని వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో ప్రధాని మోడీతో పలుమార్లు ఈ విషయంపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారన్నారు. ఇంతేకాదు తానే స్వయంగా కేంద్ర మంత్రులైన నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే, పీయూష్ గోయల్లను పలుమార్లు కలవడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశానని గుర్తుచేశారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం లేదా జాయింట్ వెంచర్ రూపంలో సీసీఐ యూనిట్ను తిరిగి తెరిచే విషయాన్ని పరిశీలిస్తామని 2016లో అప్పటి కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రి అనంత్ గీతే ప్రకటించారని కేటీఆర్ గుర్తుచేశారు.
కాని, కేంద్రమంత్రి మాటలు నీటి మీది రాతలుగానే మిగిలాయని విమర్శించారు. ఫ్యాక్టరీ పునప్రారంభానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినా.. బీజేపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లును తమ ప్రభుత్వమే తిరిగి ప్రారంభించిందన్న కేటీఆర్, కేంద్రం తలుచుకుంటే సిసిఐ కూడా పునప్రారంభం అయ్యేదన్నారు. ఇక సీసీఐని పునరుద్ధరించాలని ఆదిలాబాద్లో వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసిన పోరాటంలో బీఆర్ఎస్ నాయకులు ముందుండి కొట్లాడుతున్నారన్నారు. ఆదిలాబాద్ ప్రజలకు ఆయువుపట్టు లాంటి సిసిఐ ని తిరిగి ప్రారంభించకుండా ఆ సంస్థ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమవడం మోడీ ప్రభుత్వ కుటిలత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ మండిపడ్డారు.
Read Also: Dragon : మా సినిమా చూడండి.. మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన తమిళ దర్శకుడు
బీజేపీ మోసపూరిత వైఖరి:
2018 ఎన్నికల ప్రచారంలో సీసీఐ ని తెరుస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్గా అమ్మేందుకు ఆన్లైన్ టెండర్లు పిలవడం ఆదిలాబాద్ ప్రజలకు చేసిన మోసమేనని కేటీఆర్ ఆరోపించారు. అదిలాబాద్ వచ్చిన ప్రతి సందర్భంలో బీజేపీ నాయకులు సీసీఐని తెరిపిస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు మర్చిపోయరన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా నుంచి మొదలుకొని హంసరాజ్ గంగారం వరకు ప్రతి ఓక్కరూ ఎన్నికల్లో లబ్ధి కోసం సిసిఐ తెరిపిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అప్పనంగా అమ్మివేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని, సంస్థ పరిరక్షణ కోసం పోరాడతామని కేటీఆర్ ప్రకటించారు