కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. “నిజం నిలకడ మీద తెలుస్తుంది” అనే నానుడి నేడు నిజమైందని, కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం తప్పని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై , కేంద్రంలోని బిజెపి తీరుపై నిప్పులు చెరిగారు.
కాళేశ్వరం కుంగిపోయిందని రాష్ట్రమంతా తిరిగిన రేవంత్ రెడ్డికి (పిట్టల దొర) హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి ఫొటోలు దిగి, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తాను మొదటి నుంచీ ‘పీసీసీ రిపోర్ట్’ అని పిలుస్తున్నానని, నేడు కోర్టు తీర్పుతో అది నిజమని నిరూపితమైందని అన్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చి ఏ విధంగా వాదించినా, చివరకు సత్యమే గెలిచిందని, నిప్పులాంటి నిజం బయటకు వచ్చిందని ఆయన పునరుద్ఘాటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని, ఇది బిఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుకు అయిన మొత్తం ఖర్చు 94 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోలేదని, రాజకీయ లబ్ధి కోసం వీళ్లే కూల్చారనే విషయం త్వరలోనే బయటపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రాజెక్టులు కట్టడమే నేరమన్నట్లుగా ప్రచారం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో ఆఘమేఘాల మీద స్పందించిన ఎన్డీఎస్ఏ (NDSA), మరి ఎస్ఎల్బీసీ (SLBC) కూలినప్పుడు, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినప్పుడు ఎక్కడకు పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద ఉన్న వ్యక్తిగత కక్షతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు.
2014 ముందు , కేసీఆర్ పాలన ముగిసే నాటికి పెరిగిన పంట దిగుబడే కాళేశ్వరం ప్రాజెక్టు విజయానికి నిదర్శనమని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజకీయ కక్షలు పక్కన పెట్టి, కాళేశ్వరం నీళ్లను లిఫ్టింగ్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అబద్ధపు ప్రచారాలు మాని, పరిపాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
