NTV Telugu Site icon

KTR: తులసీ నగర్‌లో మూసీ బాధితులతో మాట్లాడిన కేటీఆర్

Ktr

Ktr

KTR: అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాకలోని తులసీ నగర్‌లో మూసీ బాధితులతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో ప్రజలు ఓట్లు వేయలేదని పగబట్టి పేదోళ్ల ఇళ్లను కూల్చివేస్తున్నాడన్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండో గుర్తు చేసుకోవాలన్నారు. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అని చెప్పారని, ఎవరికైనా వాళ్లు చెప్పిన పథకాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు.

Read Also: KA Paul: కేంద్రపాలిత ప్రాంతంగా తిరుపతి?

రైతులకు, మహిళలకు, వృద్ధులకు ఇచ్చిన హామీలు ఏమైనా అమలయ్యాయా అంటూ కేటీఆర్ అడిగారు. మూసీ మే లూటో…ఢిల్లీ మే బైటో అన్నట్లు ఉంది ఈ కాంగ్రెస్ వైఖరి అంటూ ఎద్దేవా చేశారు. మూసీలో 55 కిలోమీటర్లకు రూ. లక్షా 50 వేల కోట్లు పెట్టి ప్రక్షాళన చేస్తారంట అంటూ ఆయన తెలిపారు. ఆయన చేసిన పనిని అట్లనే వదిలేద్దామా.. మీ ఇళ్ల మీదికి బుల్డోజర్ వస్తే మీరంత ఒక్కటవ్వాలన్నారు. కూలగొట్టటానికి వచ్చినోళ్లనే మీకు మాలాగ పిల్లలు లేరా అని అడగాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కట్టిస్తామన్నారని.. ఇళ్లు కూలగొడుతామని చెప్పలేదన్నారు. పేదల ఇళ్లను బొందల గడ్డలు చేసి అక్కడ మాల్‌లు కడతామంటే ఊరుకునేది లేదన్నారు. ఇళ్లు కూలగొట్టుమని సోనియా గాంధీ చెప్పిందా? ఇళ్లు కూలగొడతామంటే ఓట్లు వేసే వాళ్లమా అంటూ ప్రశ్నించారు. మీకు కష్టం వస్తే మీ ఎమ్మెల్యే వచ్చాడని.. మీ ఎంపీ కిషన్ రెడ్డి మాత్రం ఎందుకు మాట్లాడట్లేదని ఆయన ప్రశ్నించారు.దేవుళ్ల పేరుతో చెప్పుకొని ఓట్లు వేయించుకొని ప్రజలకు కష్టం వస్తే పారిపోయేటోడు నాయకుడు ఎట్ల అవుతాడో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు.

ప్రభుత్వం చెబుతున్న లెక్క కన్నా డబుల్ దాదాపు లక్ష మంది ప్రజలను రోడ్లపై పడేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్ మస్ కానుక, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇలా అన్ని రద్దు చేశాడన్నారు. గరీబోళ్లకు మంచి చేయమని ఓటు వేస్తే గద్దలాగా తన్నుకుపోతామంటే ఊరుకోమన్నారు. నమామీ గంగా కోసం 2,400 కిలోమీటర్లకు రూ. 20 వేల కోట్లు మోడీ ఖర్చు చేశారని.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 55 కిలో మీటర్ల మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట అంటూ కేటీఆర్ అన్నారు. . మేము కూడా మూసీని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో వంద శాతం మురుగు నీటిని శుద్ది చేసేందుకు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.