Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..

Krmb

Krmb

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడంపై తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని 11వ షెడ్యూల్ 2, 3 నిబంధనలను అనుసరించి ఇరు రాష్ట్రాలు కృష్ణా నదీ జలాలను వినియోగించుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రాజెక్టు నిర్వహణలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కంటే కూడా తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన బోర్డు, శ్రీశైలంలో నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు అత్యంత కీలకమని పేర్కొంటూ, విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణను ఆదేశించింది. సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల కంటే ప్రజా అవసరాల దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కృష్ణా జలాలను కేవలం తాగునీటికే ప్రాధాన్య క్రమంలో వినియోగించాలని బోర్డు స్పష్టం చేసింది.