NTV Telugu Site icon

RBI: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్.. కొత్త కస్టమర్లకు ఝలక్!

Ke

Ke

కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్బీఐ షాకిచ్చింది. కొత్తగా ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అలాగే కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పాత కస్టమర్లకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది. ఇప్పటికే క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నవారికి.. ప్రస్తుత కస్టమర్లకు సేవలను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ ఛానెల్‌లు తరచూ అంతరాయాలకు గురవుతున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ లోపాలు గుర్తించిన నేపథ్యంలో బుధవారం ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది.

సెంట్రల్ బ్యాంక్ ప్రకారం IT ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్‌మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ కఠినత వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలను ఆర్బీఐ గుర్తించింది. నాన్-కాంప్లియెన్సులు కూడా ఉన్నట్లు తేల్చింది.

RBI రెగ్యులేటరీ గైడ్‌లైన్స్ కింద ఉన్న అవసరాలకు విరుద్ధంగా.. బ్యాంకు తన ఐటీ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్‌లో లోపభూయిష్టంగా ఉన్నట్లు వరుసగా రెండు ఏళ్లుగా అంచనా వేసింది. 2022, 2023 సంవత్సరాలకు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళికలకు బ్యాంక్ అనుగుణంగా లేదని ఆర్బీఐ తేల్చింది. బలమైన IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, IT రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ లేకపోవడంతో బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, ఆన్‌లైన్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఛానెల్స్‌లో గత రెండేళ్లలో తరచుగా అంతరాయాలను ఆర్బీఐ గుర్తించింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం 1949లోని సెక్షన్ 35A కింద తన అధికారాలను అమలు చేస్తూ కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్‌ను ఆపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. తన ఆన్‌లైన్ మరియు మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ల ద్వారా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయడం కుదరదని ఆర్బీఐ తెలిపింది.

లోపాలను గుర్తించిన నేపథ్యంలోనే కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపైనా, క్రెడిట్ కార్డుల జారీపైనా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అయితే ఇప్పటికే ఉన్న క్రెడిట్‌ కార్డుదారులకు, ఇతర కస్టమర్లకు ఎప్పటిలానే సేవలందించొచ్చని స్పష్టం చేసింది. 2020లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పైనా ఆర్‌బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది. క్రెడిట్‌ కార్డుల జారీని నిలిపివేసింది. తిరిగి 2021 ఆగస్టులో ఆంక్షలు ఎత్తివేసింది. మరోవైపు ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో కోటక్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Viral News : భర్తకు గుడి కట్టించిన భార్య.. ప్రత్యేక పూజలు కూడా..