తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బాధాకరమన్నారు. అయితే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు ఇలాంటి చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టం చేసిందని తెలిపారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉన్నా, అసంతృప్తి ఉన్నా వాటిని చర్చించేందుకు అనేక వేదికలు ఉన్నాయని చెప్పారు. అయితే పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం క్షమించరాని తప్పని పేర్కొన్నారు. ఎవరైనా బహిరంగంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయనే సంకేతాన్ని ఏఐసీసీ ఇచ్చిందని మహేష్ గౌడ్ అన్నారు.
కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సి ఉండేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. క్రమశిక్షణ సంఘం సమగ్ర నివేదిక ఆధారంగానే హైకమాండ్ చర్య తీసుకుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదన్నారు. క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదికలో అన్ని అంశాలను కూలంకషంగా పొందుపరిచారని తెలిపారు.
ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు పెద్ద అంశం కాదని.. అసెంబ్లీ సమావేశాలు, అందులో జరగాల్సిన చర్చలే ఇప్పుడు తమకు కీలకమని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయితే క్రమశిక్షణ విషయంలో కులాలు, మతాలు, ప్రాంతాలు చూడలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను ఆదరించాల్సిన బాధ్యత ఉందని, భవిష్యత్తులో బీసీలకు మరింత పెద్దపీట వేయాలన్న ఆలోచన హైకమాండ్కు ఉందని పేర్కొన్నారు.

