NTV Telugu Site icon

Kodali Nani: సీఎం జగన్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. అవి ఎప్పుడూ చేయని నేత..!

Kodali Nani

Kodali Nani

Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవసరాల కోసం మభ్యపెట్టడం, మోసం చేయడం, అబద్దాలు చెప్పడం.. దైవభక్తి ఉన్న వైఎస్‌ జగన్ ఎన్నడూ చేయలేదన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు నాని.. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.. ఇక, పలు చర్చిల అభివృద్ధికి నగదు, చెక్కులు అందజేసిన ఆయన.. పాస్టర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

Read Also: Pallavi prashanth Arrest : దయచేసి నా తమ్ముడిని వదిలేయండి..అంటూ వేడుకున్న అశ్వినిశ్రీ..

ఇక, ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టడం గానీ, మోసం చేయడం గానీ, అబద్దాలు చెప్పడం గానీ.. దైవభక్తి ఉన్న జగన్ ఎన్నడూ చేయలేదన్నారు.. ఇద్దరు (చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌) కలిసి వచ్చినా దేవ బలం, ప్రజల ఆశీస్సులు ఉన్న వైఎస్‌ జగన్ ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కుల, మతాలకతీతంగా పేదల కోసం సీఎం వైఎస్‌ జగన్ పనిచేస్తుంటే.. ఓట్ల కోసం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలతో కలిసి వైఎస్‌ జగన్ యుద్ధం చేస్తున్నాడు.. కానీ, పవన్‌ కల్యాణ్‌, పెత్తందార్లతో కలిసి, చంద్రబాబు యుద్ధం మొదలెట్టాడు అంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.