బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారాలన్నారు. నేను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, 1990లో అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని బీజేపీ పాలమూరులో తీర్మాణం చేసిందన్నారు కిషన్ రెడ్డి. అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా జేజేలు పలికిందని, బానిస మనస్తత్వం నుంచి బయటపడేలా ప్రధాని మోడీ 15 వందల చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెచ్చారన్నారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా.. కలల ఊహించనిది… మన కళ్ల ముందు అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయ్యిందని, బాబర్ కూల్చిన రామాలయాన్ని రక్తం చిందించకుండా మళ్లీ నిర్మించారని ఆయన కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువశక్తి మనదేశంలో ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోని అనేక బహుళజాతి కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని, ఏ దేశం అభివృద్ధి చెందాలన్న యువతదే కీలకపాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు.
2047లోపు భారత్ అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు తిలోదకాలు ఇచ్చామని, వంశపారంపర్య రాజకీయాలకు ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామన్నారు. కుటుంబ పార్టీలు దోపిడీ చేస్తున్నాయని, ఆనాడు మోడీకి వీసా ఇవ్వని అమెరికా.. నేడు అదే వైట్ హౌస్ లో ప్రధాని మోడీని సత్కరించారన్నారు. ఎన్నికల కోసం కాదు.. దేశాభివృద్ధి కోసం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు వద్దన్నా.. ఎవరు కాదన్నా.. ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో నరేంద్రమోడీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమని, లక్షమంది అసదుద్దీన్ లు,… లక్ష మంది కేసీఆర్ లు.. లక్ష మంది రాహుల్ గాంధీలు వచ్చినా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ కావడాన్ని అడ్డుకోలేరన్నారు. అంచనాలకు మించి ఫలితాలు రాబోతున్నాయి.. వచ్చే 5 ఏళ్లలో ఎవరు ఊహించని మార్పులు జరగబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.
