2024 దీపావళికి విడుదలై, సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరించిన ‘క’ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. అయితే, తాజాగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కిరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘శ్రీ చిదంబరం గారు’ అనే సినిమా ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ.. ‘క-2’ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కానీ, హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదని బాంబు పేల్చారు.
Also Read : Raakaasaa: సంగీత్ శోభన్ ‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్!
దర్శక ద్వయం సుజీత్-సందీప్ ఈ సీక్వెల్ కోసం పని చేస్తున్నారని, కథ డిమాండ్ చేస్తే హీరోను మార్చే అవకాశం కూడా ఉందని నిర్మాత పేర్కొన్నారు. “కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుతుంది.. హీరో పర్ఫార్మెన్స్ కంటే కథకే ప్రాధాన్యత ఇస్తాం” అని ఆయన చెప్పడం గమనార్హం. అంటే ‘క’ సినిమా కథ అక్కడితో ముగిసిందా లేక మరో కొత్త ప్లాట్తో సీక్వెల్ రాబోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే, అది ఈ సీక్వెల్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కిరణ్ ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’తో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘క’ వంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్లో తన పాత్ర ఉంటుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.