Tummala Nageswara Rao : ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

  • జై బాపు, జై భీం, జై సంవిధాన్.. సామాజిక న్యాయానికి తెలంగాణ పునాది
  • సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
  • పట్టుదలతో పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు సంపాదించవచ్చు : మంత్రి తుమ్మల
Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

Tummala Nageswara Rao : ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించారని, 4,400 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరమని, అంబేద్కర్ సూచనల మేరకు, రాజ్యాంగాన్ని అనుసరించి సమానత్వాన్ని కల్పించడంలో తెలంగాణ మోడల్‌గా నిలుస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తుమ్మల చెప్పారు. 14 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఉన్నాయని, సన్నబియ్యం, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలు నిరంతరంగా అమలు అవుతున్నాయని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. జపాన్ నుండి 12 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే కాదు, వాటితో ఉద్యోగాలుగా మార్చారు అని మంత్రి వివరించారు.

ఖానాపురం చెరువు నుండి ధంసలాపురం చెరువు వరకు రూ. 250 కోట్లతో అభివృద్ధి చేపట్టామని, రోడ్డు వెడల్పు పెంచితే అభివృద్ధి సాధ్యమని, ఇల్లు కోల్పోయిన పేదలకు మళ్లీ ఇళ్లు నిర్మించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు.. ఇళ్లు, రోడ్లు, నీరు.. ఇవే ప్రధానమైనవి అని, ఇవి అందించగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు.

పార్టీ సభ్యులు క్రమశిక్షణతో పనిచేయాలని, పేదలకు అవసరమైన సాయం అందించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. “పట్టుదలతో పని చేస్తే పార్టీ మీ పరువు కాపాడుతుందని నాయకులను ప్రోత్సహించారు మంత్రి తుమ్మల. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లపై తప్పుడు కేసులు బనాయిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రత్యర్థులను అణచివేయాలన్న ప్రయత్నమే అని ఆరోపించారు. డివిజన్ లలో అభివృద్ధి పనుల లిస్ట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్లండని, జై బాపు, జై భీం, జై సంవిధాన్ పేరుతో కార్యక్రమాలను ప్రతి పంచాయతీలో నిర్వహించాలని తుమ్మల సూచించారు.

Pakistan: పాక్ ఆర్మీ భారత్‌తో ఎందుకు యుద్ధం కోరుకుంటోంది.. కారణాలు ఏంటి..?