ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఆప్ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు కూడా సీఎం ఇంటికి చేరుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జోక్యం చేసుకోలేమని.. అరెస్ట్ను కూడా ఆపలేమని గురువారం ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్కు తేల్చి చెప్పింది. దీంతో ఈడీ అధికారులు సీఎం నివాసానికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకునే పరిస్థితులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ న్యాయ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ అధికారుల బలవంతపు చర్య నుంచి రక్షణ కల్పించాలని.. ఇందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్పై ధర్మాసనం ఏం చెబుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు తొమ్మిది సార్లు కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్లపై ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. విచారణలో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.
మరోవైపు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇటీవలే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఆమె ఉన్నారు. ఈ కేసులో ఆమెను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.