ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నంది నగర్లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటల లోపు నంది నగర్ నివాసానికి చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత రాత్రి నుంచే మాజీ మంత్రి హరీష్ రావు నంది నగర్లోనే ఉంటున్నారు.
Also Read: Ishan Kishan Century: ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు.. నా టార్గెట్ అదే!
సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ విచారణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అలాగే ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ భవన్లో ఉండనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని క్యాడర్ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకోవాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కినట్లు కనిపిస్తోంది.