తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఇప్పటివరకు టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నా.. బక్కని నరసింహులును పొలిట్ బ్యూరో, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. గత నెల 14న కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో టీడీపీలో చేరారు. అంతకు ముందు.. కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు ఉన్నారు.
Also Read : Gangula Kamalakar : యావత్ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆహార ధాన్యాలు అందిస్తోంది
2018లో కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా కాసాని జ్ఞానేశ్వర్ పనిచేశారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ఉనికి క్రమంగా కొల్పోతూ వచ్చింది. ఇటీవల పార్టీ అధినేత తెలంగాణలోని ముఖ్యనేతలతో చర్చలు జరిపి.. తెలంగాణ టీడీపీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సూచించారు. అందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. అయితే.. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం టీటీడీపీ తరుఫున అభ్యర్థి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో టీటీడీపీ మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడంలేదని పార్టీ వెల్లడించింది.