Site icon NTV Telugu

Karnataka: శ్రీనివాస్ ప్రసాద్ మృతికి సంతాపంగా మంగళవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Srinu

Srinu

కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ (76) సోమవారం కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రికిలో చకిత్స పొందుతూ మృతిచెందినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఆయన మృతిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చామరాజనగర్, మైసూర్ జిల్లాలకు మంగళవారం సెలవు ప్రకటిస్తూ సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఆయన మృతిపై అన్ని పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన కుటుంబానికి పార్టీ నేతలు సానుభూతిని తెలియజేశారు.

ఇది కూడా చదవండి: T20 World Cup 24: నేడు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సమావేశం.. ఎవరా 15 మంది!

శ్రీనివాస్ ప్రసాద్.. చామరాజనగర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మైసూర్ జిల్లా నంజనగూడ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. అనారోగ్యంతో ఆయన ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస ప్రసాద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకుంటున్నట్లు గత నెల 18నే ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Khalistan: గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర.. RAW ప్రమేయం ఉందన్న యూఎన్..!

1976లో జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం 1979లో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొన్నాళ్లు జేడీఎస్‌, జేడీయూ, సమతా పార్టీలోనూ పని చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న 1999-2004 సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో తిరిగి కాషాయ గూటికి చేరారు. 2017లో నంజన్‌గుడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2019లో చామరాజనగర్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఇది కూడా చదవండి: PM Modi: నేడు తెలంగాణకు మోడీ.. జహీరాబాద్, మెదక్ లో ప్రధాని ప్రచారం..

Exit mobile version