Site icon NTV Telugu

Priyanka Gandhi: అగ్రనేతలు కోరితే రాజీనామా చేస్తానన్న బ్రిజ్‌భూషణ్.. ప్రధానికి ట్యాగ్ చేసిన ప్రియాంక

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పార్టీ అగ్రనేతలు కోరితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ, అమిత్ షా లేదా జేపీ నడ్డాతో సహా బీజేపీ అగ్రనేతలు ఎవరైనా తనను వైదొలగాలని కోరితే తాను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా పదవీ విరమణ చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. దీనిని షేర్ చేస్తూ.. ప్రియాంక ప్రధానిని ట్యాగ్ చేశారు. ‘నరేంద్రమోదీ మరి ఆయన్ను అడగండి. అవును అని మీరు ఇచ్చే సమాధానం కోసం న్యాయం ఎదురుచూస్తోంది’ అని ఆమె పోస్టు పెట్టారు.

Read Also: Brij Bhushan Sharan Singh: నన్ను ఉరితీయండి కానీ కుస్తీని ఆపొద్దు.. బ్రిజ్ భూషణ్ కీలక వ్యాఖ్యలు

ఏప్రిల్ 29న ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఒక మైనర్‌తో సహా భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసి సమాఖ్య నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. అందులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం వారిని కలిసి ఓదార్చారు. ప్రభుత్వం వీరి ఆవేదనను వినకుండా బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న బీజేపీ ఎంపీపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపాదించినప్పటికీ, నిరసన తెలిపిన రెజ్లర్లు బీజేపీ ఎంపీని అరెస్టు చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పారు.

Exit mobile version