Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్‌పార్క్‌కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!

  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు
  • బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Jupally Challenges Ktr

Jupally Challenges Ktr

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యాసంస్థల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ రాజకీయ కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.

మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికే స్పందించానని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన విషయాన్ని వాస్తవాలతో వెల్లడించానని పేర్కొన్నారు. హరీశ్‌రావు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని ప్రకటించిన నేపథ్యంలో.. మంత్రి జూపల్లి కూడా అక్కడికే వస్తానని స్పష్టం చేశారు. ‘బావ–బామ్మర్ది ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రండి. నేనూ అక్కడికే వస్తున్నాను. మీరిచ్చిన సవాల్‌కు ప్రజల ముందే వాస్తవాలతో సమాధానం చెబుతాను. బావ ఒకచోట, బామ్మర్ది మరోచోట మాట్లాడటం ఎందుకు?. ఇద్దరూ కలిసి రండి.. ఒకేసారి సమాధానం ఇస్తాను’ అంటూ జూపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జూపల్లి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం సవాళ్లు విసురుకుంటుండటంతో గన్‌పార్క్ వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అప్పుల అంశంపై బహిరంగ చర్చ జరగాలని ఇరు పార్టీలు పట్టుబడుతుండగా.. గురుకుల విద్యాసంస్థల్లో అవినీతి ఆరోపణల అంశం కూడా రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గన్‌పార్క్, తెలంగాణ భవన్ పరిసరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

అన్ని ఆధారాలతో తెలంగాణ భావం నుంచి గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీశ్‌ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి హరీశ్‌ రావు సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను కాంచన్ బాగ్ పీస్ కి తరలించారు. ఇక చర్చ కోసం తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం సిబ్బంది చైర్ ఏర్పాటు చేయడం విశేషం.