Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!

  • జనసేన పార్టీ బలోపేతానికి మరో కీలక అడుగు
  • రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు
  • కమిటీ సభ్యులతో పవన్ ప్రత్యేక సమావేశం
Janasena Pawan

Janasena Pawan

Janasena Joining Committee: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తన సంస్థాగత బలోపేతానికి మరో కీలక అడుగు వేసింది. ఇతర రాజకీయ పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థ వర్గాలకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 14 మంది సభ్యులతో ఈ కమిటీని నియమిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో చేరికల ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, వివిధ వర్గాలకు చెందిన నాయకులను జనసేనలోకి తీసుకురావడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా పనిచేయనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన చేరికలను సమన్వయం చేస్తూ పార్టీ విస్తరణకు ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది.

జాయినింగ్స్ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టి.సి. వరుణ్, ఆరణి మదన్‌లకు స్థానం కల్పించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ జాయినింగ్స్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

×
×
Ad

జనసేన పార్టీలో చేరికలను ఎలా ప్రోత్సహించాలి, ఏ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ విస్తరణను ఎలా వేగవంతం చేయాలనే అంశాలపై కమిటీ సభ్యులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తన బలాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన.. భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా మరింత బలపడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.