Jaishankar in Kyiv: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని వెస్ట్రన్ దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. అయితే, ఈ ఆందోళనపై ఉక్రెయిన్ గడ్డపై నుంచే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని కీవ్లో గురువారం మాట్లాడిన ఆయన.. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత భారత్కు ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ ఇంధన పరిస్థితులు ప్రస్తుతం క్లిష్టంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన ఇంధన అవసరాలను విస్మరించలేదని అన్నారు. ఉక్రెయిన్ అభిప్రాయాలను భారత్ గౌరవిస్తుందని, ఇదే విధంగా భారత్ దృక్కోణాన్ని కూడా గౌరవించాలని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలకు ఇంధనం అందించాల్సిన విషయంలో సవాళ్లను అందరూ అర్థం చేసుకోవాలని జైశంకర్ అన్నారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లే యుద్ధం కొనసాగుతుందన్న వాదనల్ని జైశంకర్ తోసిపుచ్చారు. చమురు, అల్యుమినియం, ఖనిజాలు, లోహాలు ఎవరు కొనుగోలు చేస్తున్నారు.? ఎవరు కొనుగోలు చేయడం లేదు? అనే అంశంపై యుద్ధం ముగియదని అన్నారు. తాజా పరిస్థితుల్లో రష్యా-ఉక్రెయిన్ పరిష్కారం సైనిక మార్గంలో కాకుండా దౌత్యం, చర్చల వల్లే పరిష్కారమవుతుందని అన్నారు. ఈ దిశగా ప్రయత్నాలకు భారత్ సహకరించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీతో జైశంకర్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రియ్ సిబిహాతో కూడా ఆయన చర్చలు జరిపారు. యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. బ్లాక్ సీలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల అంశాన్ని భారత్ ప్రస్తావించింది. యుద్ధం కారణంగా ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరాపై ప్రభావం పడుతోందని, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు.
JAISHANKAR ON RUSSIAN OIL
S Jaishankar responds to a Ukraine journalist asking if India will keep buying Russian oil:
“This conflict will not be solved because somebody is buying or not buying oil, minerals or metals. It will be solved by dialogue, diplomacy and negotiation.”…
— Subodh Kumar (@kumarsubodh_) September 3, 2026

