Off The Record: జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం మరోసారి హీటెక్కింది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే టార్గెట్గా మళ్లీ నిప్పులు కురిపించారు. దీంతో ఆయన, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తాజాగా మాటల యుద్దం షురూ అయింది. జగిత్యాల ప్రజల కోసం నూకపల్లి అర్బన్ కాలనీలో ఇళ్ళ నిర్మాణం కేంద్రంగా ఈ వివాదం మొదలైంది. తన హయాంలో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేయగా.. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను మాత్రమే తొలగించి.. పాఠశాల, ఆస్పత్రి నిర్మిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు సంజయ్. అయితే ఓ రెండు నెలలు మౌనంగా ఉండటం…తర్వాత ఉన్నట్టుండి… ఏదో ఒక బాంబు పేల్చడం కామన్గా మారింది జీవన్రెడ్డికి…ఈ క్రమంలోనే తన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిశాక కొన్నాళ్ళు కాస్త సైలెంట్గానే ఉన్నా… ఈ మధ్య వీలు చిక్కిన ప్రతిసారీ అసంతృప్తిని వెళ్లగక్కుతూ… జర దేఖో… ఇదర్… అన్నట్టుగా పార్టీ పెద్దలకు సంకేతాలు పంపుతున్నారు.
సీనియర్ కాబట్టి ఇలాంటి సందర్భాల్లో…. గతంలో పార్టీ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేసినా….పదే పదే అలక పాన్పు ఎక్కుతుండటంతో… ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారట. దీంతో మాజీ మంత్రి లోలోపల రగిలిపోతున్నారట. ప్రత్యేకించి వరుసగా రెండు సార్లు తనను ఓడించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కారు దిగేసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు జీవన్. సంజయ్ పార్టీలో చేరినప్పుడు కొన్ని రోజులు నిర్వేదపు మాటలు, ఆ తర్వాత నియోజకవర్గంలో తనకు వ్యాల్యూ లేకుండా పోతోందని కొన్ని రోజులు.. నామినేటెడ్ పదవుల విషయంలో మరోసారి… అలిగి తన పట్టునిలుపుకునే ప్రయత్నాలు చేశారు మాజీ మంత్రి. తన అనుచరుడి హత్యను నిరసిస్తూ ఒకద శలో పార్టీని వీడినంత పనిచేశారాయన.
కానీ, పెద్దల వైపు నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కొంతకాలం వ్యూహాత్మక మౌనం పాటించారు. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనకు ప్రాధాన్యత లేదని బీజేపీ నేతల దగ్గర అన్న మాటలు కలకలం రేపాయి. ఇప్పుడిక కేవలం ఎమ్మెల్యే సంజయ్ మాత్రమే కాకుండా…రాష్ట్ర కాంగ్రెస్ నేతలను.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారట ఆయన. వివిధ అంశాలపై నేరుగా ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారట. ఆ లేఖలు సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయనే చర్చలు జరుగుతున్నాయి జగిత్యాల రాజకీయ వర్గాల్లో. అంతటితో ఆగని ఈ మాజీ ఎమ్మెల్సీ…. పక్కనే ఉన్న రెండు రిజర్వు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటూ అక్కడి ఎమ్మెల్యేలను ఖాతరు చేయడం లేదట.
దాంతో.. తమ ఇలాఖాలో ఆయన పెత్తనం ఏంటని వాళ్ళిద్దరూ రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడో ఓ స్పెషల్ స్ట్రాటజీ అప్లయ్ చేస్తున్నారట ఈ పెద్దాయన. పక్క నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే… ఆ ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు కంప్లయింట్ చేస్తారని, ఆ విధంగానైనా… వాళ్ళు పిలిస్తే వెళ్లి అన్ని విషయాలు మాట్లాడవచ్చని అనుకున్నారట. కానీ… బ్యాడ్లక్… వాళ్ళు లోలోపల కుమిలిపోతున్నారు తప్ప… పార్టీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళకపోవడంతో… సార్ అస్త్రం తుస్సుమన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి పట్ల జీవన్ వ్యవహరించిన తీరు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. జీవన్ రెడ్డి కనిపించగానే ఆత్మీయంగా పలకరిద్దామని మంత్రి పొంగులేటి దగ్గరకు రాగా… ఆయన మాత్రం కావాలని దూరం జరిగారు..
అంతే కాకుండా మీదే రాజ్యం.. మీదే పార్టీ… మీరే ఏలుకోండి అంటూ కాస్త స్వరం పెంచి మాట్లాడటంతో అవాక్కయ్యారట మంత్రి పొంగులేటి. ఇక తాజాగా ఎమ్మెల్యే సంజయ్ని టార్గెట్ చేయడం వెనక కారణాలు ఏంటి..? లేఖల పేరుతో స్వపక్షంలో విపక్షంలా మారడం దేనికి అనే అంశాలపై హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి జగిత్యాలలో. అవకాశం వచ్చేదాకా ఎదురు చూడకుండా….తానే స్పేస్ క్రియేట్ చేసుకునే ప్రయత్నాల్లో సీరియస్గా ఉన్నారని, తన ఉనికిని నిరూపించుకునేందుకే ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్నట్టు అంచనా వేస్తున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో తన వాళ్ళకు సీట్లు ఇప్పించుకోవాలంటే… ముందు వాళ్లు చేజారకుండా చూసుకోవాలి కాబట్టి… కాస్త అగ్రెసివ్గా వెళ్లాలని, అలా వెళ్తేనే తన మాటకు వ్యాల్యూ వస్తుందనే ప్లాన్లో ఉన్నారట జీవన్రెడ్డి. స్థానిక ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దక్కించుకునేలా పక్కాగా ప్లాన్ వేసారట ఈ సీనియర్ లీడర్. అలకలు… అగ్రెసివ్ మాటలు… తన వాళ్లకు పదవులను తెస్తాయా..? పదే పదే ఇబ్బంది పెడుతున్న పెద్దాయన వ్యవహారాన్ని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.