Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..

Jaggareddy

Jaggareddy

Jaggareddy: అయోధ్య శ్రీరామ మందిరంలో జరిగినట్లు వెలుగులోకి వచ్చిన దొంగతనం ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిరానికి వచ్చే భక్తులు హుండీలో సమర్పించిన డబ్బులు దోచుకుపోయారని ఆరోపిస్తూ.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

అయోధ్యలోనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తుచేసిన జగ్గారెడ్డి.. రామ మందిర ట్రస్ట్ వ్యవహారాలు కూడా బీజేపీ నాయకత్వ పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ ఘటనపై ఎవరూ నోరు విప్పకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీలను పంపించి వివరాలు సేకరించాలని సూచించారని చెప్పారు.

ఇన్నేళ్లుగా బీజేపీ రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని జగ్గారెడ్డి విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి శ్రీరాముడి పేరు కూడా ఒక కారణమని పేర్కొంటూ.. ఇప్పుడు అదే రాముడి ఆలయంలో జరిగిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శ్రీరాముడిని కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారా అని నిలదీశారు. మహాత్మా గాంధీ కూడా “రఘుపతి రాఘవ రాజారాం” అని చెప్పేవారని.. నెహ్రూ హయాంలో కూడా రాముడి పాలన కొనసాగిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను చిన్న విషయంగా కొట్టిపారేయడం సరైంది కాదని, రాముడి గుడిలో దొంగతనం జరగడం అత్యంత తీవ్రమైన అంశమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇలాంటి ఘటన జరిగి ఉంటే బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు, కులాలను కలిపే రాజకీయాలు చేస్తుందని.. బీజేపీ మాత్రం కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని జగ్గారెడ్డి ఆరోపించారు. కనీసం ఈ ఘటనపై ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. కేటీఆర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారని, అందుకే విమర్శలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పాలనలో బిజీగా ఉన్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడం, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు నిధుల జమ వంటి పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు.

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత విద్యుత్ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. కేటీఆర్ ఎన్ని విమర్శలు చేసినా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని, ఆ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.