NTV Telugu Site icon

1984 Riots Case: 1984 అల్లర్ల కేసు.. కాంగ్రెస్‌ నేత జగదీష్ టైట్లర్‌పై హత్యానేరం

Jagdish Tytler I

Jagdish Tytler I

1984 Riots Case: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో జగదీష్ టైట్లర్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోని ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు గుంపును ప్రేరేపించి, మైదానంలో అల్లర్లకు నాయకత్వం వహించారని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరోపించింది. “మొదట సిక్కులను చంపి, ఆపై వారి దుకాణాలు, విలువైన వస్తువులను దోచుకోవాలని జగదీష్ టైట్లర్ గుంపును కోరాడు” అని సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ప్రత్యక్ష సాక్షుల ప్రకటనలు పేర్కొన్నాయి. మే 20, 2023న 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో టైట్లర్‌పై సీబీఐ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ ఆయనపై హత్య, అల్లర్లు, దాడి వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసింది. అల్లర్లకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కాంగ్రెస్ నాయకుడు హామీ ఇచ్చారని ఛార్జిషీట్ పేర్కొంది. ఆయన తన నియోజకవర్గంలో జరిగిన హత్యల సంఖ్యను ఇతర ప్రదేశాలతో పోల్చాడని, మరింత మంది సిక్కులపై దాడి చేయాలని తన అనుచరులను కోరాడని సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.

Also Read: Third INDIA Meet: ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశానికి తేదీ ఫిక్స్.. ఆతిథ్యం ఇవ్వనున్న ఉద్ధవ్

ఛార్జిషీట్‌లో నమోదైన ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం, కాంగ్రెస్ నాయకుడు తన తెల్ల అంబాసిడర్ కారు నుండి బయటకు వచ్చి గుంపును ప్రేరేపించడం ప్రారంభించాడు.”ఆయన (టైట్లర్) కారు నుంచి బయటకు వచ్చి, మొదట సిక్కులను చంపమని, ఆపై వారి దుకాణాలను దోచుకోమని ప్రేరేపించాడు.” 1984 అక్టోబర్ 31న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్య తరువాత జరిగిన అల్లర్లను చూసిన ప్రత్యక్ష సాక్షి తెలిపినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. ఫలితంగా అల్లరిమూకలు పుల్‌ బంగష్ ద్వారాకు నిప్పుపెట్టారు. ఆ తర్వాత ముగ్గురు సిక్కు వ్యక్తులను చంపేశారు’’ అని సీబీఐ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. గురుద్వారా పుల్ బంగాష్ సమీపంలో జరిగిన అల్లర్లకు జగదీష్ టైట్లర్ కారణమని చూపించడానికి తగినన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయని సీబీఐ పేర్కొంది.

Also Read: Anju Nasrullah Love Story: అంజు కేసులో కొత్త ట్విస్ట్.. అంజు, నస్రుల్లాపై అరవింద్ పోలీసులకు ఫిర్యాదు

కాగా, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో పుల్ బంగాష్ హత్యలకు సంబంధించిన కేసులో టైట్లర్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష విలువైన వ్యక్తిగత పూచీకత్తు, అంతే విలువకు సరిపడ హామీతో ఈ బెయిల్‌ మంజూరు చేశారు. సాక్ష్యాధారాలను మార్చేందుకు ప్రయత్నించరాదని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని టైట్లర్‌పై కొన్ని ఆంక్షలు విధించారు. టైట్లర్‌ సతీమణి జెన్నిఫర్‌ ఆయనకు షూరిటీగా ఉన్నారు. ఈ పూచీకత్తును, హామీని అంగీకరించిన ఢిలీల కోర్టు.. ఛార్జ్‌షీట్‌ కాపీని టైట్లర్‌కు ఇవ్వాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.