Iran-US Tensions: ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు మిసైళ్ల దాడులు.. అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న సంక్షోభం..

Iran Us

Iran Us

Iran-US Tensions: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మళ్లీ అత్యంత ఉద్రిక్తతంగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ తీరప్రాంత ప్రావిన్స్ అయిన ‘బుషెహర్’తో పాటు వ్యూహాత్మక ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) ప్రాంతంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బుషెహర్ ప్రావిన్స్‌లోని ‘జామ్’ ప్రాంతంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక అమెరికా సైనిక విమానాన్ని విజయవంతంగా కూల్చివేసిందని ఇరాన్ మీడియా క్లెయిమ్ చేసింది. జామ్ కౌంటీ గవర్నర్ మసూద్ తంగెస్తానీని ఉటంకిస్తూ ఇరాన్ స్టేట్ టీవీ, తమ వైమానిక రక్షణ వ్యవస్థ శత్రు విమానాన్ని అడ్డుకుని కూల్చేసిందని ప్రకటించింది. అయితే అమెరికా అధికారులు ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. ఈ ప్రాంతంలో తమ విమానాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఇరాన్ చేస్తున్నవన్నీ అబద్ధపు ప్రచారాలని ఓ అమెరికా అధికారి రాయిటర్స్‌తో స్పష్టం చేశారు.

ఇరాన్ వార్తా సంస్థలు ‘తస్నీమ్’, ‘ఫార్స్’ నివేదికల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున బుషెహర్ ఆకాశం క్షిపణుల వెలుగులు, పేలుళ్లతో హోరెత్తిపోయింది. ఇరాన్ సాయుధ దళాలు దేశ దక్షిణ ప్రాంతాల నుంచి పలు మిసైళ్లను ప్రయోగించాయని, అయితే వాటి ఖచ్చితమైన లక్ష్యాలు ఇంకా తెలియరాలేదని ఫార్స్ సంస్థ తెలిపింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకలను హెచ్చరించడానికి ఇరాన్ సముద్రంలో భారీగా కాల్పులు జరపడంతో తీరప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) హోర్ముజ్ సమీపంలో నాలుగు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం గమనార్హం. అందులో కొన్ని నౌకలకు అమెరికాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఇరు దేశాల మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్), హోర్ముజ్ జలమార్గాన్ని తెరవడంపై ఒక ‘శాంతి ఒప్పందం’ కుదిరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న తరుణంలోనే ఈ తాజా సైనిక ఘర్షణ చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోంది.

×
×
Ad

శాంతి చర్చల టేబుల్ వద్ద ఓ ప్రణాళిక సిద్ధమవుతుండగానే.. గురువారం నాడే అమెరికా ఇరాన్ చమురు వ్యాపారంపై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో పాలుపంచుకున్న మార్షల్ ఐలాండ్స్, కొమొరోస్, పనామాలకు చెందిన ఎనిమిది నౌకలను (ట్యాంకర్లను) అమెరికా ట్రెజరీ విభాగం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. చమురు రాబడి ద్వారా ఇరాన్ తన సైనిక శక్తిని పెంచుకోకుండా నిరోధించడమే ఈ ఆంక్షల ముఖ్య ఉద్దేశమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ స్పష్టం చేశారు. దీంతో దౌత్యపరంగా శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదిరినట్లు స్పష్టమవుతోంది.