Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..

Hormuz Open

Hormuz Open

Strait of Hormuz: ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) వేదికగా ఇరాన్ ఒక సంచలన వ్యూహానికి తెరతీసింది. తన ప్రాదేశిక జలాల గుండా వెళ్లే అంతర్జాతీయ నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. అంటే, సుదూర ప్రాంతాలకు సరుకులను చేరవేసే ఓడలకు హోర్ముజ్ మార్గంలో ఒక కొత్త ‘టోల్ ప్లాజా’ను ఏర్పాటు చేయబోతోందన్నమాట. ఈ చెల్లింపులను ఇరాన్ రయాల్‌లోనే కాకుండా తమకు నచ్చిన ఏ ఇతర కరెన్సీలోనైనా స్వీకరించడానికి సిద్ధపడటం గమనార్హం. ఇది నేరుగా అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఇరాన్ విసిరిన అతిపెద్ద సవాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ ప్రతిపాదించిన ఈ వ్యూహాత్మక ప్రణాళికలోని ఆర్టికల్ 3 ప్రకారం, ఆ మార్గంలో ప్రయాణించే నౌకలకు తాము అందించే సేవలకు గాను ఇరాన్ ఫీజు వసూలు చేస్తుంది. నావిగేషన్ సహకారం, సముద్ర పర్యావరణ పరిరక్షణ, భద్రత, ఇన్సూరెన్స్ వంటి సేవలతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధనం లేదా ఇతర సదుపాయాలు అందిస్తే వాటికి ప్రత్యేకంగా ఛార్జీలు వర్తిస్తాయి. హోర్ముజ్ గుండా వెళ్లేందుకు అనుమతి ఉన్న ప్రతి దేశపు నౌక నుంచి ఈ రుసుము తీసుకుంటామని ఇరాన్ ఎంపీ హసన్ ఘష్ఘవీ స్పష్టం చేశారు. అయితే, ఇరాన్‌కు ఇలా అంతర్జాతీయ నౌకలపై టోల్ వసూలు చేసే హక్కు ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం, ఏ దేశమూ అంతర్జాతీయ నౌకల రాకపోకలను అడ్డుకోకూడదు, సాధారణ ప్రయాణానికి పన్నులు వేయకూడదు. కానీ, సదరు నౌకలకు ప్రత్యేక సేవలు అందించినప్పుడు మాత్రం ఫీజులు తీసుకోవడానికి కొన్ని సడలింపులు ఉన్నాయి. సరిగ్గా ఈ లొసుగునే ఆసరాగా చేసుకుని, ‘సేవల’ పేరుతో ఫీజుల నెపంతో టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ తెలివిగా పావులు కదుపుతోంది.

ఈ నిర్ణయం వెనుక ఇరాన్ తీవ్ర ఆర్థిక ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ కరెన్సీ రయాల్ విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో దేశానికి అత్యవసరంగా విదేశీ నగదు అవసరమైంది. అందుకే ఈ మార్గాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని ఇరాన్ చూస్తోంది. అయితే, ఈ నిర్ణయాన్ని ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు అంత సులభంగా అంగీకరించకపోవచ్చు. అమెరికా ఆంక్షల భయంతో చాలా దేశాలు ఇరాన్‌కు అదనపు చెల్లింపులు చేయడానికి వెనుకాడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్లాన్ కనుక అమల్లోకి వస్తే, అంతర్జాతీయ షిప్పింగ్ ఛార్జీలు పెరగడమే కాకుండా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.