మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ చేస్తున్న దాడుల వల్ల గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఇంధన వనరులు ఎక్కువగా ఉన్న దేశాలలోని చమురు, గ్యాస్ నిలయాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా ఖతార్లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ (Ras Laffan) పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఖతార్ ప్లాంట్పై దాడి జరగడంతో అక్కడ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాతో సమానంగా గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం ఖతార్. మార్చి మొదటి వారంలో కూడా ఇరాన్ ఇలాంటి దాడులే చేయడంతో గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ తనపై చేసిన దాడులకు బదులుగానే ఇరాన్ ఈ చర్యలకు దిగుతోంది.
Also Read:Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..
వ్యాపారంపై ప్రభావం..
ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు భాగం హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారడంతో ఓడల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 700 సరుకు రవాణా నౌకలు మధ్యప్రాచ్య తీరాల్లోనే నిలిచిపోయాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. ఇంధన సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.
భారత్పై పడే ప్రభావం..
ఈ పరిస్థితి భారతదేశంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఎందుకంటే.. భారతదేశం తన గ్యాస్ అవసరాల్లో 50 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం గ్యాస్ ఒక్క ఖతార్ నుంచే వస్తుంది.
ఖతార్లో ఉత్పత్తి ఆగిపోవడం వల్ల భారత్కు అందాల్సిన గ్యాస్ సరఫరాలో భారీ కోత పడింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్ తన గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో గ్యాస్ వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్లో రోజుకు 189 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం కాగా.. అందులో సగం మాత్రమే మన దగ్గర ఉత్పత్తి అవుతోంది. మిగిలిన సగం విదేశాల నుంచి రావాలి. యుద్ధం వల్ల ఈ దిగుమతులకు ఆటంకం కలగడంతో.. భారత ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఇతర దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.