Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!

  • పశ్చిమాసియాలో శాంతి దిశగా అడుగులు
  • యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం
  • పాకిస్థాన్‌కు కీలక సమాచారం!
Iran

Iran

ఇరాన్-అమెరికా మధ్య ప్రాణ సంకటంగా మారిన యురేనియంపై టెహ్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో శాంతి ప్రజ్వరిల్లే దిశగా అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో యురేనియం ఉండటానికి వీల్లేదని అమెరికా, ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఈ కారణంతోనే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. దీంతో ప్రపంచం వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గలేదు. ఇక శాంతి ఒప్పందానికి ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యురేనియం వదులుకుంటేనే శాంతి ఒప్పందం జరుగుతుందని అమెరికా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

×
×
Ad

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ దగ్గర ఉన్న సుసంపన్న యురేనియంలో కొంత భాగాన్ని మూడో దేశానికి బదిలీ చేయడానికి అంగీకరించినట్లు ఇరాన్ పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

అల్ అరబియా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ శుక్రవారం ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మోమెనితో సమావేశమయ్యారు. కిర్గిజ్‌స్తాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ అంతర్గత మంత్రుల సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, ఉద్రిక్తతల తగ్గింపు చర్యలు, అంతర్గత భద్రత అంశాలపై చర్చించినట్లు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్-అమెరికా యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్చలు జరిగినట్లు సమాచారం. మూడవ దేశానికి కొంత యురేనియం బదిలీ చేయడానికి ఇరాన్ అంగీకరించిందని నివేదికలు అందుతున్నాయి.

శాంతి చర్చలకు కొత్త మలుపు


ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-అమెరికా ఘర్షణలను ముగించేందుకు పాకిస్థాన్ చురుకుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై గతంతో పోలిస్తే మరింత సానుకూల వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరాన్ లేదా పాకిస్థాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.