ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై కూడా తేలిపోతున్న ఎస్ఆర్హెచ్.. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే 5 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్కు ప్లేఆఫ్స్ రేసులో ప్రతి గేమ్ కీలకంగా మారింది. మరో 2-3 ఓటములు ఎదురైతే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్లో అదరగొట్టిన గుజరాత్ హ్యాట్రిక్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/17) దెబ్బకు 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (31; 34 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18; 16 బంతుల్లో 4×4), ఇషాన్ కిషన్ (17; 14 బంతుల్లో 2×4) త్వరగానే అవుట్ అయ్యారు. ఆపై గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎస్ఆర్హెచ్ 10 ఓవర్లలో 3 వికెట్లకు 64 పరుగులే చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (27; 19 బంతుల్లో 2×4, 1×6) కూడా భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడ్డాడు. 19వ ఓవర్లో అనికేత్వర్మ (18; 14 బంతుల్లో 2×4), సిమర్జీత్ సింగ్ (0)లను సిరాజ్ ఔట్ చేశాడు. అయితే ఇషాంత్ శర్మ వేసిన చివరి ఓవర్లో ప్యాట్ కమిన్స్ (22 నాటౌట్; 9 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడంతో సన్రైజర్స్ 150 పరుగుల మార్కును దాటింది.
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. సాయి సుదర్శన్ (5), జోస్ బట్లర్ (0) త్వరగానే అవుట్ అయ్యారు. 4 ఓవర్లలో 17/2తో కష్టాల్లో పడింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ (49; 29 బంతుల్లో 5×4, 2×6) రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ 48/2తో నిలిచింది. శుభ్మన్ గిల్ (61 నాటౌట్; 43 బంతుల్లో 9×4) కూడా జోరందుకోవడంతో గుజరాత్ లక్ష్యం దిశగా నడిచింది. ఇద్దరు మూడో వికెట్కు 90 పరుగులు జోడించి గుజరాత్ను మెరుగైన స్థితికి చేర్చాడు. సుందర్ అవుట్ అయ్యాక రూథర్ఫర్డ్ (35 నాటౌట్; 16 బంతుల్లో 6×4. 1×6), ఫీల్ కలిసి మిగతా పని పూర్తి చేశారు. 16.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన గుజరాత్ హ్యాట్రిక్ విజయం ఖాతాలో వేసుకుంది.