ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో గెలిచిన పంజాబ్.. మరో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ దాంట్లో ఓడి, మరోదాంట్లో విజయం సాధించిన లక్నో.. పంజాబ్పై గెలవాలని చూస్తోంది.
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంతో పంజాబ్ కింగ్స్ టీమ్ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి మ్యాచ్లో గుజరాత్పై గెలుపొందింది. శ్రేయస్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రియాంశ్ ఆర్య (47), శశాంక్ సింగ్ (44) కూడా సత్తా చాటారు. హిట్టర్లు మ్యాక్స్వెల్, స్టోయినిస్ కూడా ఫామ్ అందుకుంటే పంజాబ్కు తిరుగుండదు. గత మ్యాచ్లో బౌలర్లు అర్షదీప్ సింగ్, విజయ్కుమార్ వైశాక్ పర్వాలేదనిపించారు. అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చహల్ సత్తాచాటాల్సి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో గెలవాల్సింది కానీ దురదృష్టవశాత్తు ఓడింది. హైదరాబాద్ జట్టుపై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేంజర్ బ్యాటర్ కిల్లర్ మిల్లర్ కూడా వేగంగా రన్స్ చేశాడు. అయితే ఐడెన్ మార్క్రమ్, కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరితో పాటు బదోని కూడా టచ్లోకి వస్తే లక్నోకు తిరుగుండదు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ కూడా రాణించారు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Hardik Pandya: ఫైనల్లీ హార్దిక్ పాండ్యా దొరికేశాడు.. ఏకంగా బస్సులో! వీడియో వైరల్
తుది జట్లు (అంచనా):
పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.
లక్నో: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేశ్ రతీ, ప్రిన్స్ యాదవ్.