తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గూడు లేని పేదల కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మొదటి దశ కింద ఇప్పటికే 3.60 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లలో కనీసం లక్ష యూనిట్లను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసి.. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందాల్సిన నగదు చెల్లింపుల్లో జాప్యం జరిగినా లేదా ఎక్కడైనా నిలిపివేసినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ (APR) నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
Also Read:PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..
ఈ పథకం కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా.. పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని విడతల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐటి (IT) ఆధారిత వ్యవస్థను, మొబైల్ యాప్లను ప్రభుత్వం వినియోగిస్తోంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండ్ మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చేలా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కేవలం ఇళ్లే కాకుండా.. ఆయా కాలనీల్లో రోడ్లు, విద్యుత్ , తాగునీటి సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సమయానికి ఇళ్లు పూర్తి చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది.