India vs UAE: తొలి మ్యాచ్‌లో భారత్ రికార్డు విజయం.. రప్ఫాడించిన బౌలర్లు..

Ind Uae

Ind Uae

టీ20 ఆసియా కప్ 2025లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో యూఏఈపై భారత్‌ రికార్డు విజయం సాధించింది.. యూఏఈపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్థి జట్టు యూఏఈ కేవలం 58 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. భారత్ బ్యాటర్లు కేవలం 4.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ, ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు. మొదటి ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ 4, 6 బాదడంతో 15 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్‌లో అభిషేక్ శర్మ 6, 4 బాదాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, జునైద్ సిద్ధిఖీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ రాగానే సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు.

READ MORE: PM Modi: ఇజ్రాయిల్ దాడిని ఖండించిన మోడీ, ఖతార్ ఎమిర్‌‌కు ఫోన్ కాల్..

టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో యూఏఈకి ఇది అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ శివమ్ దూబే విధ్వంసం సృష్టించారు. కుల్దీప్ 2.1 ఓవర్లలో 7 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టారు. శివమ్ 2 ఓవర్లలో నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.

READ MORE: Nepal Palace Massacre: ప్రేమకు బలైన నేపాల్ రాజ కుటుంబం.. ప్యాలెస్‌లో ఊచకోత.. ఆ నాటి విషాద గాథ

మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో యూఏఈ కేవలం 31 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు తరఫున అలీషాన్ షరాఫు (22) అత్యధిక స్కోరు సాధించాడు. కెప్టెన్ మహ్మద్ వసీం 19 పరుగులకే పరిమితమయ్యాడు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (3), హర్షిత్ కౌశిక్ (2) సహా ఎనిమిది మంది ఆటగాళ్ళు రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.