Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!

Rohit Sharma2

Rohit Sharma2

Rohit Sharma Retirement: లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే మూడో వన్డేతో మరో మహా సంగ్రామానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ కేవలం ఒక టోర్నమెంట్ విజేతను తేల్చేది కాదు, ఇరు దేశాల మధ్య జరిగే 22వ ద్వైపాక్షిక వన్డే సిరీస్ టైటిల్ ఎవరిదో నిర్ణయించే అసలైన ఫైనల్ మ్యాచ్. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి సిరీస్‌ను సమం చేయడంతో ఇప్పుడు లార్డ్స్‌లో జరిగే పోరు డూ-ఆర్-డైగా మారింది. ఇప్పటివరకు జరిగిన 21 సిరీస్‌లలో ఇంగ్లాండ్ కేవలం 7 సార్లు మాత్రమే గెలవగా, చివరగా 2018లో భారత్‌పై సిరీస్ నెగ్గింది. దీంతో ఈసారి ఎలాగైనా టీమిండియాను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించాలని హ్యారీ బ్రూక్ సేన పట్టుదలతో ఉంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా క్యాంప్‌లో కెప్టెన్సీ మారినప్పటికీ సీనియర్ ప్లేయర్‌గా ఉన్న రోహిత్ శర్మ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కార్డిఫ్‌లో రోహిత్ చాలా నెమ్మదిగా ఆడటంతో 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందే సెలెక్టర్లు అతనికి గుడ్‌బై చెప్పబోతున్నారనే ఊహాగానాలు, సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ నుంచి ఫస్ట్ రియాక్షన్ బయటకు వచ్చింది. తన వన్డే భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలపై భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పరోక్షంగా స్పందించాడు. బయట జరిగే ప్రచారాలు తమకు అనవసరమని రోహిత్ కొట్టిపారేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహిత్ శర్మ భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌తో మాట్లాడుతూ కనిపించాడు. “బయట ఏం జరుగుతుందో దాంతో మనకేం సంబంధం” (హుమ్ లాగ్ కో బాహర్ క్యా చల్ రహా హై, ఉస్ సే హుమ్కో క్యా) అని అనడం అందులో వినిపించింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఇక రోహిత్ రిటైర్మెంట్ వార్తలన్నీ పుకార్లే అని ఓ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ప్రారంభానికి ముందే, రోహిత్ భవిష్యత్తు ప్రణాళికల్లో లేరని సెలక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు అతనికి తెలిపినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల గురించి భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా సమాచారం అందించారు. అయినప్పటికీ, మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐ ఉన్నతాధికారులను సంప్రదించడంతో అతను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. వన్డే ఫార్మాట్‌లో 11,700 కంటే ఎక్కువ పరుగులు చేసిన అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన రోహిత్, భారత్ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడంలో జట్టును నడిపించాడు. ఆ విజయం తర్వాత శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ, బ్యాటింగ్ లైన్-అప్‌లో రోహిత్ శర్మ సీనియర్ ఆటగాడిగా, భారత ప్రణాళికల్లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.