India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ – భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్కు వర్షం ముప్పు..

India Vs Afghanistan

India Vs Afghanistan

India vs Afghanistan: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శనివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియం వేదికగా శ్రీకారం చుట్టనుంది. ఈ సిరీస్‌ తో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. అయితే స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా సిరీస్ కు దూరం అయ్యారు.

హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ మొత్తం సిరీస్‌కు దూరం కావడంతో.. దీంతో మూడో స్థానంలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లలో ఎవరికి అవకాశం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో నంబర్-3 స్థానంలో పలువురు ఆటగాళ్లను పరీక్షించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి రావడం అభిమానులకు శుభవార్తగా మారింది. ఐపీఎల్ 2026 సమయంలో గాయపడిన రోహిత్ తాజాగా ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసై తిరిగి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. 39 ఏళ్ల 44 రోజుల వయసులో వన్డే ఆడనున్న రోహిత్, భారత తరఫున అత్యధిక వయసులో వన్డే ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించనున్నాడు.

×
×
Ad

మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్ పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితీష్‌పై జట్టు యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్ లేదా గుర్నూర్ బ్రార్‌లో ఒకరు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశముంది.

మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తిరిగి జట్టులో చేరడం బలాన్నిచ్చింది. ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి కీలక ఆటగాళ్లతో అఫ్గాన్ జట్టు కూడా పోటీకి సిద్ధమైంది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు నెలకొంది. శుక్రవారం రాత్రి ధర్మశాలలో భారీ వర్షం కురవగా, శనివారం ఉదయం కూడా మేఘావృత వాతావరణం కొనసాగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడే అవకాశాలు దాదాపుగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు వర్ష సూచనలు ఉండటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధర్మశాల పిచ్ సంప్రదాయంగా పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. మేఘావృత పరిస్థితులు, పిచ్‌పై తేమ కారణంగా కొత్త బంతితో స్వింగ్ ఎక్కువగా లభించే అవకాశం ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జట్టు వ్యూహాలను ఖరారు చేశాయి. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉండగా, జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

భారత్ ప్లేయింగ్ XI:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్/గుర్నూర్ బ్రార్.

అఫ్గానిస్తాన్ ప్లేయింగ్ XI:
ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సదీకుల్లా అతల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్, ఏఎం ఘజన్‌ఫర్, జియౌర్ రెహ్మాన్.