India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!

  • భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం
  • ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
  • గణనీయమైన పురోగతి సాధించామన్న సెర్గియో గోర్
Usindia

Usindia

భారత్-అమెరికా దేశాలు న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య సంబంధాన్ని నిర్మించేందుకు సన్నిహితంగా పనిచేస్తున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య అవగాహనపై ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించామని వెల్లడించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని ఆయన తెలిపారు.

ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 66వ వార్షిక సమావేశంలో సెర్గియో గోర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమైన, పరస్పర ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే వాణిజ్య సంబంధాన్ని నిర్మించేందుకు మా రెండు ప్రభుత్వాలు సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయి. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించారా లేదా నాకు తెలియదు. కానీ మంత్రి పీయూష్ గోయల్ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జీ20 చర్చల నేపథ్యంలో అమెరికాతో చర్చలను కొనసాగిస్తారు’’ అని సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే కుదుర్చుకున్న వాణిజ్య అవగాహనతో పాటు పలు అంశాల్లో వాస్తవమైన పురోగతి సాధించామని తెలిపారు.

భారత్-అమెరికా మధ్య పురోగతి కేవలం వస్తువుల వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదని గోర్ అన్నారు. ఇరు దేశాలు దాదాపు అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్, అమెరికా ‘Pact Silica’ డిక్లరేషన్‌పై సంతకం చేశాయని తెలిపారు. ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఇది కీలక ముందడుగు అని చెప్పారు. ఈ డిక్లరేషన్ వల్ల భారత్-అమెరికా కంపెనీలు పరస్పరం సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టుకోవడం సులభతరం అవుతుందని గోర్ వివరించారు. అలాగే ఇరు దేశాల్లోని కొత్త తరం పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు వాణిజ్యానికి మించి సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణలు తదితర రంగాల్లో మరింత విస్తరిస్తున్నాయని సెర్గియో గోర్ పేర్కొన్నారు.