India-Russia S-400 Deal: రష్యా – భారత్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రపంచానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి కనిపిస్తూనే ఉంది. భారతదేశం త్వరలో రష్యా నుంచి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం పెద్ద సంఖ్యలో క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.10 వేల కోట్లుగా నివేదించారు. భారత వైమానిక దళం S-400 వ్యవస్థ ఇప్పటికే పాకిస్థాన్పై తన ప్రభావాన్ని చూపింది. నాలుగు రోజుల ఘర్షణలో ఈ వ్యవస్థ ఐదు నుంచి ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలను, ఒక గూఢచారి విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసింది. భారత వైమానిక దళం దీనిని గేమ్ ఛేంజర్గా అభివర్ణించింది.
READ ALSO: Govt Jobs 2025: లైఫ్ సెట్ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.. మరికొన్ని రోజులే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
అక్టోబర్ 23న సమావేశం..
భారత వైమానిక దళం రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ క్షిపణులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంపై భారతదేశం – రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23న ఈ ఒప్పందంపై రష్యాతో చర్చించడానికి సమావేశం కానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ భారత్- రష్యాతో 10,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకోనుంది. భారతదేశం ఇప్పుడు తన వైమానిక దళానికి మరిన్ని S-400 స్క్వాడ్రన్లను జోడించాలని యోచిస్తోంది. ఇండియా ఇప్పటికే రష్యా నుంచి మూడు ఆపరేషనల్ స్క్వాడ్రన్లను అందుకుంది. నాల్గవ స్క్వాడ్రన్ డెలివరీ కావడానికి ముందే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. మిగిలిన రెండు స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని రష్యాను భారత్ అభ్యర్థించింది.
రెండు దేశాలు కూడా S-500 వైమానిక రక్షణ వ్యవస్థపై చర్చలు జరుపుతున్నాయి. భారతదేశం తన BVR (బియాండ్ విజువల్ రేంజ్) సామర్థ్యాలను మరింత పెంచుకోవడానికి రష్యా నుంచి కొత్త ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి సామర్థ్యాలను పెంచడం గురించి కూడా భారతదేశం, రష్యా చర్చించాయి. వాస్తవానికి ఈ డీల్ పాక్ గుండెల్లో గుబులు కలిగించేదిగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ సమరానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!
