ICC T20 Ranking: అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా ఆధిపత్యానికి తెరపడింది. ఏకంగా 1,605 రోజుల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో రారాజుగా వెలిగిన భారత జట్టు, ఆ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. శనివారం సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో సామ్ కరన్, ఆదిల్ రషీద్ల అద్భుత బౌలింగ్ ధాటికి భారత్ 56 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఇంగ్లాండ్ 4-0తో క్లీన్స్వీప్ చేసింది. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియాను ఇంగ్లాండ్ అన్ని రంగాల్లోనూ చిత్తు చేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇప్పటివరకు భారత్కు కనీసం ఒక్క విజయం కూడా దక్కకపోవడం గమనార్హం.
మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (6)ను ప్రసిద్ధ్ కృష్ణ త్వరగానే అవుట్ చేసినప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ జోస్ బట్లర్ కలిసి భారత బౌలర్లను ఉతికేసారు. అక్షర్ పటేల్, సూర్యాంశ్ శెడ్గే, ప్రిన్స్ యాదవ్ల బౌలింగ్లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. బట్లర్ కేవలం 64 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 131 పరుగులు చేయగా.. బ్రూక్ 45 బంతుల్లో 95 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరి వీరవిహారంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ తరఫున శివమ్ దూబే వరుస బంతుల్లో బట్లర్, బెథెల్లను అవుట్ చేసి 2 వికెట్లు తీశాడు.
258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (3)ను జోఫ్రా ఆర్చర్ త్వరగానే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్, సంజు శామ్సన్తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 5 ఓవర్లలో స్కోరును 55 పరుగులకు చేర్చాడు. అయితే, పవర్ప్లే ఆఖరి ఓవర్లో సంజూ (27) అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. మరోవైపు పోరాడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56 పరుగులు, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వికెట్ను ఆదిల్ రషీద్ పడగొట్టాడు. శివమ్ దూబే (14) కూడా సామ్ కరన్ బౌలింగ్లో వెనుతిరిగాడు. చివర్లో తిలక్ వర్మ 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకపోయింది. యువ ఆటగాడు సూర్యాంశ్ శెడ్గే క్రీజులో ఉన్నప్పటికీ, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో భారత్ సిరీస్తో పాటు తన ప్రతిష్టాత్మక నంబర్ 1 స్థానాన్ని సైతం ఇంగ్లాండ్ చేతిలో పోగొట్టుకుంది.

