PM Modi: ఆసియా కప్ 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసి భారత్ 9వ సారి ఆసియా కప్ విజేతగా అవతరించింది. ఈ విజయం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని సృష్టించింది. అభిమానులు వీధుల్లోకి వచ్చి డాన్స్ లు చేస్తూ, బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకున్నారు. మరికొందరు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు.దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులు, ఫఖర్ జమాన్ 46 పరుగులతో పాక్ ను ఆదుకున్నారు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి విజయం సాధించింది.
Ind vs Pak : పాక్ను చిత్తు చేసిన భారత్.. భారత్కు తొమ్మిదోసారి ఆసియాకప్ ట్రోఫీ
ఈ విజయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. అతను 53 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. శివమ్ దూబే కూడా 22 బంతుల్లో 33 పరుగుల కీలక ఇన్నింగ్స్ తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టీమిండియా గెలుపుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి జైశంకర్, ఐసీసీ చైర్మన్ జై షా సహా పలువురు ప్రముఖులు భారత జట్టును అభినందించారు.
ఇక ప్రధాని మోదీ అయితే.. “గేమ్స్ ఫీల్డ్లో ఆపరేషన్ సిందూర్.. ఎక్కడైనా ఫలితం మాత్రం మారదు. భారతే గెలుస్తుంది” అంటూ భారత జట్టుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. క్రికెట్ విజయాన్ని సైనిక ఆపరేషన్తో పోల్చడం ద్వారా ఈ గెలుపు ప్రాధాన్యతను ఆయన చాటిచెప్పారు. ఇది పాక్ పై ఓ రకమైన కౌంటర్గానూ అనుకోవచ్చు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా టీమిండియాను అభినందిస్తూ.. టోర్నమెంట్లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్ “ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. కొత్త భారత్ సత్తా చాటింది” అని ట్వీట్ చేశారు.
Today Horoscope: ఆ రాశి వారికి నేడు అన్నీ అనుకూలమే.. పట్టిందల్లా బంగారమే!
ఇక సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ చేసిన రెచ్చగొట్టే సైగలకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఘాటుగా బదులిచ్చాడు. ఫైనల్ మ్యాచ్లో రౌఫ్ను అవుట్ చేసిన తర్వాత, బుమ్రా ‘విమానం కూలిపోయినట్లు’ సంజ్ఞ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది గత మ్యాచ్లో రౌఫ్ చేసిన చర్యలకు ప్రత్యక్షంగా ఇచ్చిన సమాధానంగా మారింది. మొత్తంగా ఈ విజయం కేవలం క్రీడల్లోనే కాకుండా, దేశభక్తిని కూడా పెంపొందించింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేసిన సైనిక చర్యను, క్రికెట్ మ్యాచ్తో ప్రధాని మోదీ పోల్చడం గెలుపు ప్రాముఖ్యతను మరింత పెంచింది. పూంచ్ ప్రాంతంలో భారత సైనికులు స్థానికులతో కలిసి విజయోత్సవాలను జరుపుకున్నారు.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025