Suryakumar Yadav: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా అద్భుతం చేసింది. ఇంగ్లాండ్పై స్వల్ప తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. కేవలం ఏడు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు దేశాలకు చెందిన కోట్లాది మంది అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కు పోయారు. చివరి వరకు మ్యాచ్ను వీక్షించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో మాత్రం భారత్ పూర్తిగా ఆధిపత్యం చాటింది. హార్దిక్ పాండ్యా కీలక సమయంలో ఫిల్ సాల్ట్ వికెట్ తీసి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. తర్వాత అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ పట్టి హ్యారీ బ్రూక్ను ఔట్ చేశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి జోస్ బట్లర్ను ఔట్ చేసి ఇంగ్లాండ్ ఆశలకు మరో దెబ్బ కొట్టాడు. దీంతో కొంతసేపు మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వెళ్లినట్లే కనిపించింది.
READ MORE: Vrushakarma : ‘వృషకర్మ’ గ్లింప్స్లో విలన్ హైలైట్పై నాగచైతన్య క్లారిటీ
ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంతో సంతోషం వ్యక్త చేశాడు. సొంత దేశంలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్లో ఫైనల్కు చేరడం ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చిందన్నాడు. అహ్మదాబాద్లో జరిగే తుది పోరుకు వెళ్లడం ఎంతో ఆసక్తికరంగా ఉందన్నాడు. సంజూ శామ్సన్ను పొగడ్తలతో ముంచేత్తాడు. సంజూ క్రీజ్లోకి వచ్చిన వెంటనే తన లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుసుకున్నాడని.. వికెట్లు పడినప్పటికీ.. ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడాడని గుర్తు చేశాడు. గతేడాది నుంచి ఎంతో కష్టపడి సాధన చేసిన సంజూకు ఇది మంచి ఫలితమని, జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు.
READ MORE:Iran-Gulf War: గల్ఫ్లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
ఇంగ్లాండ్ లక్ష్య ఛేదన గురించి కూడా సూర్యకుమార్ మాట్లాడాడు. “ఇంత పెద్ద స్కోరు చేసిన తర్వాత కూడా మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వారి పోరాటాన్ని తగ్గించి చెప్పలేం. అయితే జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ వంటి బౌలర్లు కీలక సమయంలో మ్యాచ్ను తిరిగి భారత్ వైపు మళ్లించారు. అంతేకాదు.. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చేసిన శ్రమ ఫలితమే మైదానంలో కనిపిస్తోంది. సాధన సమయంలో ఆటగాళ్లతో సరదాగా, పోటాపోటీగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించడం వల్లే ఆటగాళ్లు మరింత చురుకుగా మారారు. నేను క్యాచ్ పట్టే సమయంలో చాలా ఉత్కంఠగా అనిపించింది. నా గుండె వేగంగా కొట్టుకుంది. అయితే ఇలాంటి ఒత్తిడి పెద్ద మ్యాచ్లలో సహజం.” అని కెప్టెన్ తెలిపాడు. మైదానంలో అభిమానుల మద్దతు జట్టుకు భారీ ఉత్సాహాన్ని ఇచ్చిందని సూర్యకుమార్ వివరించాడు. వార్మప్ సమయంలోనే స్టేడియం దాదాపు నిండిపోయిందని, అభిమానులు భారత్ విజయం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అప్పుడు అర్థమైందని అన్నాడు. తాము ఆ అభిమానులకు మంచి ఆట చూపించామని ఆశిస్తున్నానని తెలిపాడు.
